Bargi Dam boat accident: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. బర్గి డ్యామ్ (నర్మదా నది బ్యాక్ వాటర్స్) లో సుమారు 30 నుంచి 40 మంది పర్యాటకులతో వెళ్తున్న ఒక క్రూయిజ్ బోటు అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులు, తుపాను ధాటికి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
సహాయక బృందాలు 15 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడాయి. అయితే, మరో 10 నుంచి 12 మంది వరకు నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ (SDERF), స్థానిక పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. జబల్పూర్ జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్, ఎస్పీ సంపత్ ఉపాధ్యాయ స్వయంగా ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
అకస్మాత్తుగా వాతావరణం మారిపోవడం, భారీ గాలులతో కూడిన తుపాను రావడమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అధికారులు భావిస్తున్నారు. అయితే, పడవలో సామర్థ్యానికి మించి పర్యాటకులు ఉన్నారా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. చీకటి పడటం, వెలుతురు సరిగ్గా లేకపోవడంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించారు.
Read Also: నేపాల్ లో ఘోర ప్రమాదం.. 700 మీటర్ల లోయలో పడ్డ జీపు.. 17 మంది దుర్మరణం