Action Drama On OTT : యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్ల కోసం ఇప్పుడు ఓటీటీలో ఓ మాస్ ట్రీట్ రెడీగా ఉంది. హీరోగా మాత్రమే కాదు, దర్శకుడిగానూ విశాల్ మెగాఫోన్ పట్టుకున్న ‘మకుటం’ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విశాల్ లింగ, కిరుబ అనే తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్లో కనిపించారు. అసలు తండ్రీకొడుకుల మధ్య అంత దూరం ఎందుకు వచ్చింది ? ఓ విషాదం తర్వాత ప్రశాంతంగా ఉండే కొడుకు చేతిలోకి ఆయుధం ఎందుకు వచ్చింది ? చివరికి లింగ, కిరుబ కలిసి నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు ఎదురైంది ? ఈ ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? ఈ సినిమాను తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.
కిరుబ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తూ భార్య జమున, ఇద్దరు పిల్లలతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ కిరుబ తండ్రి లింగ మాత్రం అతడికి పూర్తి భిన్నమైన వ్యక్తి. లింగ ఓ గ్యాంగ్స్టర్. బయటకు చాలా హడావుడిగా కనిపించినా, తన వాళ్ల కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం అతడిది. తండ్రి జీవితం నచ్చకపోవడంతో కిరుబ అతడికి దూరంగా ఉంటాడు. అంతలోనే కిరుబ జీవితం ఒక్కసారిగా విషాదంలోకి జారిపోతుంది. స్థానిక గ్యాంగ్స్టర్ల కారణంగా అతని కుటుంబం దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది.
తన భార్య, కూతురిని కళ్లముందే కోల్పోయిన తర్వాత కిరుబ పూర్తిగా మారిపోతాడు. ఇంతకాలం హింసకు దూరంగా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు ప్రతీకారం కోసం ఎంత దూరమైనా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఈ సమయంలోనే అతని జీవితంలోకి తండ్రి లింగ మళ్లీ వస్తాడు. ఒకప్పుడు తండ్రి దారిని వ్యతిరేకించిన కిరుబ… ఇప్పుడు అదే తండ్రి సాయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ? తండ్రీకొడుకుల మధ్య ఉన్న పాత విభేదాలు పక్కన పడతాయా ? తమ కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్లపై ఇద్దరూ కలిసి ఎలా పోరాడారు ? అన్న విషయం తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. ఈ తండ్రీకొడుకుల సంఘర్షణ, యాక్షన్ సన్నివేశాలే ‘మకుటం’ సినిమా స్టోరీ.
Also Read : కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్
‘మకుటం’ సెప్టెంబర్ 11 నుంచి Amazon Prime Videoలో తెలుగు వెర్షన్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో థియేటర్లలో విడుదలైన తర్వాత నెలలోపే తెలుగు, తమిళ భాషల్లో డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. విశాల్ డ్యూయల్ రోల్లో కనిపించే ఈ మాస్ యాక్షన్ డ్రామా… యాక్షన్తో పాటు తండ్రీకొడుకుల ఎమోషన్ను ఇష్టపడేవాళ్లకు మంచి ఓటీటీ ఆప్షన్. ఇందులో విశాల్ సరసన దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటించారు. కుటుంబ భావోద్వేగాలు, తండ్రీకొడుకుల బంధం, ప్రతీకారం, మాస్ యాక్షన్ను కలిపి కథను నడిపించారు. రవి అరసు కథ అందించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు.