Car Blast: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కారులో యువతిని (23) చంపేందుకు యత్నించిన ఓ యువకుడు (30).. అదే కారు పేలిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే యువతి, డ్రైవర్ అయిన మరో వ్యక్తి మాత్రం కారులో నుంచి దూకి.. తమ ప్రాణాలను కాపాడుతున్నారు. ప్రస్తుతం బాధిత యువతి.. తుమకూరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు నాగేంద్ర బెంగళూరులో ఓ ప్రైవేటు కారును బుక్ చేసుకున్నాడు. నగరంలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో థియేటర్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న రమ్యతో కలిసి అంకోలా వైపు బయలుదేరాడు. అయితే తుమకూరు సమీపంలోకి కారు చేరుకున్న తర్వాత వారి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
గొడవ తీవ్ర రూపం దాల్చడంతో నాగేంద్ర బ్యాగులో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో నాగేంద్ర వద్ద బాంబు కూడా ఉందని.. బాధితురాలు రమ్య.. కారు డ్రైవర్ ను హెచ్చరించింది. అనంతరం రన్నింగ్ కారు నుంచి బయటకు దూకేసింది. మరోవైపు డ్రైవర్ సైతం కారును రోడ్డు పక్కన ఆపేసి.. దూరంగా పరిగెత్తాడు. డ్రైవర్ దూరంగా వెళ్లిన కాసేపటికే కారులో భారీ పేలుడు జరిగి.. వాహనం దగ్దమైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read: ఈ అత్త ఎంత మంచివారో.. తన కోడలి కోసం ఏం చేశారో చూడండి!
నాగేంద్ర తన వెంట తెచ్చుకున్న నాటు బాంబును పేల్చుకొని చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే పేలుడుకు కచ్చితమైన కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. పేలుడు స్వభావాన్ని ఫోరెన్సిక్ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. అటు యువతిపై దాడికి గల కారణాలను సైతం అన్వేషిస్తున్నట్లు తుమకూరు ఎస్పీ అశోక్ వెల్లడించారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.
Also Read: ఏపీలో మెగా డ్రోన్ నెట్వర్క్.. కిలోమీటరుకు 10 పైసలే.. ఇక గాల్లోనే సరుకు రవాణా!