Mulugu Irrigation: స్వేచ్ఛ బ్యూరో: ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీరు అందించేలా చర్యలు వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలో కొనసాగుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా అభివృద్ధి పనులను పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు న్యాయం చేస్తూనే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సచివాలయంలో ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపైరాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్కు అవసరమైన భూసేకరణపై అధికారులు సమగ్ర నివేదికను మంత్రులకు సమర్పించారు. కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల పరిధిలో ఈ ప్రాజెక్టుకు మొత్తం సుమారు 244.23 ఎకరాల భూమి అవసరమవుతుందని తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని వివరించారు.
భూసేకరణకు సంబంధించి 2020-21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించారని, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు గణనీయంగా పెరగడంతో ఆ ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. పాత అవార్డులో నిర్ణయించిన పరిహారం ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం అనుగుణంగా లేదని, అందువల్ల రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
Also read: Vegetable Prices: కూరగాయల ధరల దెబ్బకు.. సామాన్యుడి గుండె గుభేల్..!
రైతులు ప్రస్తుత భూముల ధరలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లిస్తే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారని, అయితే పాత ధరలతో భూసేకరణ కొనసాగించడం వల్ల కేసులు పెండింగ్లో ఉండిపోయాయని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో పాత అవార్డులను ఉపసంహరించి ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా కొత్త భూసేకరణ ప్రక్రియ చేపట్టడమే సరైన మార్గమని అధికారులు అభిప్రాయపడ్డారు.
దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క రైతుల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా భూసేకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. 2020-21లో జారీ చేసిన పాత భూసేకరణ అవార్డును ఉపసంహరించి, తాజా మార్కెట్ విలువల ఆధారంగా కొత్త అంచనాలు రూపొందించి వెంటనే తాజా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు న్యాయమైన పరిహారం అందేలా పారదర్శకంగా భూసేకరణ చేపట్టి, రైతుల విశ్వాసాన్ని పొందుతూ పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
Also read: వెంకీ మామ ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ లాక్.. మిస్ అవుతారేమో?
రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమవుతుందని, సుమారు 8,700 ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు వివరించారు. అంతేకాకుండా మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చడంలోనూ, లక్నవరం పర్యాటకాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్, ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఇరిగేషన్ ఈఎన్సీ రమేష్ బాబు, ములుగు ఆర్డీవో కృష్ణవేణి, సంబంధిత చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అదేవిధంగా పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని, వచ్చే వారంలోనే శంకుస్థాపన జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో కొనసాగుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, ప్రతి ప్రాజెక్టు పురోగతిపై క్రమం తప్పకుండా సమగ్ర నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈఎన్సీకి మంత్రులు ఆదేశించారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు న్యాయం చేయడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం రెండూ సమానంగా ప్రభుత్వ బాధ్యతలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
Also read: ఆంధ్రా వర్సెస్ తెలంగాణ… కాంట్రవర్సీకి తెరలేపిన ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ !