అనుకున్నట్టే అది లాకప్డెత్ అని తేలింది. గాదె సాయికృష్ణది కస్టోడియల్ డెత్గా తేల్చారు సిట్ పోలీసులు. కోర్టుకు సమర్పించిన సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలను పొందుపర్చింది సిట్. గాదె సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో డెలివరీ బాయ్ చూసి గుర్తించిన విషయాన్ని.. అతను అక్కడే చనిపోయిన అంశాన్ని ధ్రువీకరించిన ఆ స్టేషన్ ఎస్ఐ వాంగ్మూలాన్ని సమర్పించడం ద్వారా ఇది లాకప్ డెత్ అనే విషయాన్ని స్పష్టం చేశారు సిట్ పోలీసులు.
కానీ ఆ డెడ్బాడీని ఏం చేశాడో చెప్పలేదు సీఐ నాగరాజు. మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ పుటేజీలను తొలగించిన విషయంపై కూడా అది టెక్నికల్ ప్రాబ్లెమని మాత్రమే సమాధానమిచ్చి అసలు విషయాన్ని దాచే ప్రయత్నమే చేశాడు. అంటే సిట్ పోలీసులు కూడా అతని నుంచి నిజం రాబట్టలేకపోయారన్నమాట. కస్డీడీకి ఇవ్వాలని కోరినా.. కోర్టు అతనికి వచ్చే నెల 8 వరకు రిమాండ్ చేసింది. ఓ సీఐ ఇంతటి దౌర్జన్యానికి దిగడం వెనుక.. ఇది ఒక్కడి పని మాత్రం కాదని తేలుతోంది. దీనికి పోలీసు పెద్దల సహకారం ఉంటుందనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి.
ఇప్పుడు రిమాండ్ రిపోర్టులోని అంశాల ఆధారంగా అది నిజమేనని తేలుతోంది. సీఐని ఒక్కడిని ముందుంచి.. దీని వెనుక ఉన్న పాత్రదారులు.. సూత్రధారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది నిగ్గుతేలిన నిజం. ఇక దీనిపై సర్కార్ ఎలా ముందుకు పోతుందో.. దీనికి ఎలా పుల్స్టాప్ పెడుతుందోననే చర్చ సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. దృశ్యం సినిమాలో సస్పెన్స్ లాగా.. సీఐ నాగరాజు నోరు విప్పకపోవడంతో ఈ మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదు.
రిమాండ్ ముగిసిన తరవాత కూడా నాగరాజు నోరు విప్పేలా లేడు. దీని వెనుక పోలీసు పెద్దలు.. వారి వెనుక ప్రభుత్వ పెద్దలు.. ఇలా లింకు ఉండే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక ఈ రహస్యం రహస్యంగానే ఉంటుంది. సాయికృష్ణను కాల్చి బూడిద చేశారనేది సుస్పష్టం. కానీ అది ఎలా చేశారు. ఎవరెవరు ఉన్నారు? ఎక్కడ చేశారు…? ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు? ఇది ఎలాగూ బయటపడుతుందని తెలిసీ.. ఎందుకు దాచి ఉంచాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి.
కానీ అది ఒక్క సీఐ నాగరాజు ద్వారానే రావాలి. సిట్ విచారించిన తరువాత పరిస్థితులు చూస్తే మాత్రం.. నాగరాజు నోరు విప్పేలా లేడు.ఈ రహస్యం వీడేలా లేదు. ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ మాత్రం దీన్ని తన రాజకీయ అస్త్రంగా వాడుకోనుంది. మొదటి నుంచి జగన్ ఆరోపిస్తున్నది కూడా అదే. అది లాకప్డెత్ అని వారికి కచ్చితంగా తెలిసిపోయింది. ఇక దీన్నిదాచి దాచి పెద్దది చేయడం మూలంగానే సర్కార్ను బజారులోకి లాగినట్టయ్యింది.
ఇప్పుడు ఇది కూటమి సర్కార్కు తలనొప్పిని తెచ్చిపెట్టే విషయంగానే మారింది. ఓ నిందితుడిని లాకప్డెత్ చేయడం సర్కార్కు ఓ మాయని మచ్చనే. ఇదే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న అంశం. సాయికృష్ణపై పోక్సో, మర్డర్ ఇతర కేసులున్నాయి. నిందితుడు ఘరానా నేరస్తుడే. కానీ అతడిని చంపి మాయం చేయడం.. అదృశ్యంగా మారిన కేసు.. దృశ్యం సినిమాకు మించి హైప్ను తెచ్చిపెట్టింది. అదే సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. పోలీసులు సర్కార్ను నడిపిస్తున్నారా? ప్రభుత్వం చెప్పినట్టు పోలీసులు వింటున్నారా? అనే చర్చ కూడా ఏపీ రాజకీయాల్లో మొదలైంది.