సమాజం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. చిన్నపాటి కారణాలకే ప్రాణాలు తీసేందుకు వెనుకాడటం లేదు. డబ్బు కోసం మనుషులు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న సంఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కేవలం ఐదు రూపాయల భిక్షం విషయంలో తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారితీయడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని స్వాతి మార్కెటర్స్ అనే డిష్ టీవీ షాపు వద్దకు ఒక యాచకుడు వచ్చాడు. యజమాని శ్రీనివాస్ ఆ సమయంలో తన వ్యాపార పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. యాచకుడు భిక్షం అడగడంతో శ్రీనివాస్ మానవత్వంతో ఐదు రూపాయలు తీసి ఇచ్చాడు. అయితే ఆ ఐదు రూపాయలు చూసిన యాచకుడు ఒక్కసారిగా అసహనానికి గురయ్యాడు. ప్రస్తుత రోజుల్లో ఐదు రూపాయలతో ఏం వస్తుందని సదరు యజమానిని నిలదీశాడు.
తక్కువ భిక్షం ఇచ్చావంటూ యాచకుడు యజమానితో వాదనకు దిగాడు. శ్రీనివాస్ అతడిని వెళ్ళిపోమని చెప్పినప్పటికీ వినకుండా దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. కోపంతో ఊగిపోయిన ఆ యాచకుడు తన వద్ద దాచుకున్న కత్తిని తీసి ఒక్కసారిగా శ్రీనివాస్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఊహించని పరిణామంతో షాపు యజమాని తీవ్ర గాయాలపాలయ్యాడు. చుట్టుపక్కల వారు గమనించేలోపే యాచకుడు రెచ్చిపోయి వీరంగం సృష్టించాడు.
ఈ దారుణ ఘటనను చూసిన పొరుగు దుకాణదారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యాచకుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన శ్రీనివాస్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చూసిన స్థానికులు విస్మయానికి గురవుతున్నారు.
అడిగినంత ఇవ్వలేదని ఏకంగా ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించడం చూస్తుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. చిన్నపాటి ఆర్థిక లావాదేవీలు ప్రాణసంకటంగా మారుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మహబూబాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.