Hyderabad: హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ’ (HCU) క్యాంపస్లో భారీ చోరీ కలకలం రేపింది. వర్సిటీ పరిధిలోని సి.ఆర్. రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (AIMSCS) భవనంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు తమ చేతివాటం ప్రదర్శించారు. క్లాస్ రూమ్ కిటికీ గ్రిల్స్ను అత్యంత చాకచక్యంగా తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు, అక్కడ భద్రపరిచిన సుమారు 50 ల్యాప్టాప్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ. 25 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సోమవారం ఉదయం సిబ్బంది ఇన్స్టిట్యూట్కు చేరుకోగా, కిటికీ గ్రిల్స్ విరిగి ఉండటం, ల్యాప్టాప్లు కనిపించకపోవడాన్ని గమనించి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వర్సిటీ అధికారులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. అత్యంత పకడ్బందీ భద్రత ఉండే యూనివర్సిటీ లోపల ఇలాంటి భారీ దొంగతనం జరగడం భద్రతా వైఫల్యాలపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
పోలీసుల దర్యాప్తులో భాగంగా సి.ఆర్. రావు ఇన్స్టిట్యూట్, వర్సిటీ ప్రధాన ద్వారాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. దొంగలు ల్యాప్టాప్లను ఒక కారులో తరలించినట్లు కెమెరాల్లో రికార్డు అయ్యింది. నిందితులు క్యాంపస్ లోపలికి ఎలా ప్రవేశించారు? వారికి లోపలి వ్యక్తుల సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ భారీ చోరీ వెనుక ప్రొఫెషనల్ గ్యాంగ్ ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read: స్టీరింగ్ ఊడిపడడంతో బస్సు బోల్తా.. స్పాట్లో 40 మంది, కడప జిల్లాలో ప్రమాదం
ఈ ఘటనతో విద్యార్థుల ప్రాజెక్ట్ డేటా, పరిశోధనలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.