Open Manhole: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్ఎంసీ సర్కిల్లో ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా, రోడ్లు ధ్వంసమవుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు రోడ్డుమధ్య నోరు తెరిచి ఉన్న మ్యాన్హోల్పైనా కళ్లు మూసుకున్నారు. మేడ్చల్ డివిజన్లో అత్యంత రద్దీగా ఉండే హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డులో ఈ ప్రమాదకర మ్యాన్హోల్ చాలా రోజులుగా తెరిచే ఉంది.
Also read: ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలు.. బంగారం లాంటి భవిష్యత్తు
వాహనదారుల ఇబ్బందులు..
ఇదే దారిలో మున్సిపల్ కార్యాలయం, ఏసీపీ కార్యాలయం, మండల పరిషత్, తహసీల్దార్, ఎంఈవో కార్యాలయాలకు అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నా ఎవరూ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రోడ్డుమధ్యలో ఉన్న ఈ ‘మృత్యుగుంత’ కారణంగా వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ప్రమాదం జరిగాక మేల్కొనే బదులు ఇప్పటికైనా అధికారులు స్పందించి మ్యాన్హోల్ను మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: నోరు జారితే రాజకీయ భవిష్యత్తు ఖతం.. కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం!