Shivpuri Child Physical Abuse| తాగిన మైకంలో ఓ యువకుడు (టీనేజర్) పైశాచికంగా ప్రవర్తించాడు. అన్నయ్య అని పిలిచే పొరిగింటి చిన్నారి (5)పై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత కృూరంగా ప్రవర్తించాడు. ఆ పాపను గోడకేసి కొట్టాడు. ముఖాన్ని గట్టిగా కొరికేశాడు. తరువాత అత్యాచారం చేసి పడేసి పారిపోయాడు. ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో జరిగింది.
ఆ పాప ఒంటి నిండా నిందితుడి పంటి గుర్తులు పడ్డాయి. పాప కడుపులో పెద్ద పేగు చిద్రమైంది. చివరికి పాప ప్రైవేట్ భాగం చీలిపోయి ఉంది. కనీసం మంచంపై పక్కకు తిరగలేని స్థితిలో… కొన ఊపిరితో ఉందా చిన్నారి. వింటుటూనే సగటు మనిషి హృదయం చలించిపోతుంది.
నిందితుడు ఎవరంటే?..
ఫిబ్రవరి 22వ తేదీన శివపురి జిల్లా దినార (Dinara) ప్రాంతంలో ఇంటి డాబాపైన ఆడుకుంటున్న ఆ ఐదేళ్ల చిన్నారి… హఠాత్తుగా కనిపించకుండా పోయింది. తోటి పిల్లలను ఆ తల్లి ఆరా తీస్తే… పక్కింటి భయ్యా చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లాడని చెప్పారు. రెండు గంటలైనా వాళ్లు తిరిగి రాలేదు. దీంతో… కంగారుపడిన తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో ఆ కాలనీ సమీపంలోనే ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో పాప రక్తపు మడుగులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. శరీరంపై తీవ్ర గాయాలై… లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో చిన్నారిని హుటాహుటిన గ్వాలియర్ కమలారాజ్ ఆస్పత్రిలో చేర్పించారు.
Also Read: వైద్యం పేరుతో 300 మంది చిన్నారులపై అత్యాచారం, వీడికి ఏ శిక్ష వేయాలి?
గంటల తరబడి ఆపరేషన్లు
పాప ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వైద్యులు రెండు గంటలపాటు ఆమెకు అత్యవసర సర్జరీలు చేశారు. గాయాలకు చికిత్సతో పాటు చిద్రమైన పెద్ద పేగును కత్తిరించి కృతిమంగా మలద్వారం సృష్టించారు. ప్రైవేట్ పార్ట్కు 28 కుట్లు వేశారు. అయినప్పటికీ శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
మైనర్ అయితే శిక్ష ఉండదా?..
ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఆమె పక్కింట్లోనే ఉంటాడు. మద్యం మత్తులో తాను ఈ నేరానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే… అతని వయసు 17 ఏళ్లు 6 నెలలగా పోలీసులు ప్రకటించడంతో ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. నిందితుడిని మైనర్గా చూపించి… శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. అయితే…
పోలీసులు మాత్రం నిందితుడి వయసు నిర్ధారణ ఇంకా జరగలేదని చెబుతున్నారు. అప్పటిదాకా… జువైనల్ చట్టాల ప్రకారమే అతన్ని అదుపులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు స్థానిక ఎంపీ, బిజేపీ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా (Jyotiraditya Scindia) ఈ దారుణ ఘటనను ఖండించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతోపాటు బాధిత తల్లిదండ్రులతోనూ ఆయన మాట్లాడారు. చట్టం ప్రకారం ఈ కేసులో కఠినంగా శిక్ష పడాల్సిందేనని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.