Mumbai Sports Scam | రీసెంట్గా వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో హీరో ఎలా తను పని చేస్తున్న బ్యాంకులో ఉన్న లూప్హోల్స్ ఉపయోగించుకొని కోటీశ్వరుడయ్యాడో చూశాం కదా. సరిగ్గా అలాగే చెయ్యబోయాడో 23 ఏళ్ల కుర్రాడు. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం నివసించే హర్షల్ కుమార్ క్షీర్సాగర్ అనే కుర్రాడు.. తను పనిచేస్తున్న బడా కంపెనీని మోసం చేసి ఏకంగా 21 కోట్ల రూపాయలు కొట్టేశాడు. కేవలం రూ.13000 నెల జీతం కోసం చిన్న ఉద్యోగం చేసే హర్షల్.. ఒక బియండబ్యూ కారు, ఒక ఎస్యువి, ఒక బియండబ్యూ బైక్ తో పాటు తన ప్రియురాలి రూ.కోటి విలువ చేసే నాలుగు బెడ్రూంల ఫ్లాట్ కొని బహుమతిగా ఇచ్చాడు. అతను పనిచేసే కంపెనీ బ్యాంకు అకౌంట్లో ఇంత డబ్బు మాయమైపోయిందని చాలా కాలం తరువాత గుర్తించి, పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాక ఇంత పెద్ద మోసం బయటపడింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఉన్న ఒక డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో హర్షల్ కుమార్ పనిచేస్తున్నాడు. అతనికి ఒక గర్ల్ఫ్రెండ్ కూడా ఉంది. ఆమెను బాగా చూసుకోవాలని, తను డబ్బున్న వాడిలా కనబడాలని హర్షల్కు ఆశ. కానీ అతని జీతం కేవలం 13 వేల రూపాయలే. ఆ డబ్బుతో తను అనుకున్న జీవితం గడపడం కష్టమని అతనికి తెలుసు. అలాంటి సమయంలో హర్షల్కు లక్కీగా తన కంపెనీకి చెందిన ఒక పాత లెటర్ హెడ్ దొరికింది. దాన్ని పట్టుకొని తన జీవితం మార్చుకోవాలని అనుకున్నాడు.
తమ కంపెనీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉన్న జీమెయిల్ మారుతోందని, కొత్త మెయిల్ను అప్డేట్ చెయ్యాలని ఒక లెటర్ పంపాడు. పాత జీమెయిల్ అకౌంట్ పేరులో కేవలం ఒక్క అక్షరమే మార్చి పంపాడతను. దాంతో బ్యాంకు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ మారిన పేరుతో తను క్రియేట్ చేసిన జీమెయిల్కు బ్యాంకు అకౌంట్కు సంబంధించిన ఓటీపీలన్నీ యాక్సెస్ చెయ్యగలిగాడు హర్షల్. అలా జూలై 1 2024 నుంచి డిసెంబర్ 7, 2024 వరకు కొంచెం కొంచెంగా కంపెనీ ఖాతాలోని డబ్బులను వేరే ఖాతాలకు పంపడం మొదలు పెట్టాడు. అలా మొత్తం 13 బ్యాంకు అకౌంట్లకు 21.6 కోట్ల రూపాయలు పంపించాడు.
Also Read: 6 మంది పురుషులను వివాహం చేసుకున్న యువతి.. ఏడోసారి పెళ్లికి కూడా రెడీ.. కానీ
ఆ డబ్బుతో 1.2 కోట్ల రూపాయల బీఎండబ్ల్యూ కారు, 1.3 కోట్ల ఖరీదైన ఎస్యూవీ, 32 లక్షల విలువైన బీఎండబ్ల్యూ బైక్ కొన్నాడు. అక్కడితో ఆగకుండా తన గర్ల్ఫ్రెండ్కు ఛత్రపతి శంభాజీనగర్ ఎయిర్పోర్టుకు సమీపంలో 4 బెడ్రూంస్ ఫ్లాట్ ఇప్పించాడు. కేవలం 13 వేల శాలరీ ఉన్న కుర్రాడు ఇంత పోష్ లైఫ్ గడపడం చాలామందికి అనుమానాలు కలిగించింది. అదే సమయంలో ఒక కంపెనీ ఉద్యోగికి తమ బ్యాంకు అకౌంట్లో లెక్కలు తేడా ఉన్నట్లు అర్థమైంది. అతను కంపెనీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లిన తర్వాత.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు.. కంపెనీ ఖాతా నుంచి డబ్బులు మొత్తం పదమూడు అకౌంట్లకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ స్కాంలో హర్షల్ పాత్రను కూడా గుర్తించారు. అదే కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగి యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్ అనే ఇద్దరు కూడా హర్షల్కు సహాయం చేసినట్లు తేలింది. ఈ కేసులో ఇద్దరినీ అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు హర్షల్, మరో వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.