బ్యాంకు అధికారులు సామాన్యులకు అండగా ఉండాల్సింది పోయి.. బరితెగించి చేసిన ఒక దారుణ మోసం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి, లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేసుకున్న కేటుగాళ్ల బండారం ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామానికి చెందిన గంగాధర్ గౌడ్ కుటుంబం ఈ బ్యాంకింగ్ దగాకు బలైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మృతి చెందిన మూడేళ్లకు లోన్ మంజూరు..
నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామానికి చెందిన గంగాధర్ గౌడ్ 2013లో మరణించారు. అయితే, ఆయన మరణించిన మూడు సంవత్సరాల తర్వాత, అంటే 2016లో ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ మేనేజర్, ఇతర సిబ్బంది కుమ్మక్కై గంగాధర్ గౌడ్ పేరు మీద భారీ మొత్తంలో రుణాన్ని మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి నకిలీ ధృవీకరణ పత్రాలు, సంతకాలను సృష్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయిన వ్యక్తి మళ్ళీ వచ్చి లోన్ అడిగినట్లు రికార్డులు సృష్టించడం బ్యాంక్ అధికారుల అత్యుత్సాహానికి, అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
కుటుంబ సభ్యులపై దౌర్జన్యం..
ఈ విషయం వెలుగులోకి రావడానికి కారణం బ్యాంకు సిబ్బంది చేసిన దౌర్జన్యం. గత కొంతకాలంగా గంగాధర్ గౌడ్ ఇంటికి వెళ్తున్న బ్యాంకు రికవరీ ఏజెంట్లు, సిబ్బంది.. బకాయిలు చెల్లించాలంటూ కుటుంబ సభ్యులను వేధించడం ప్రారంభించారు. తన తండ్రి 2013లోనే చనిపోయారని.. ఆయన లోన్ తీసుకోవడం అసాధ్యమని గంగాధర్ కుమారుడు రాజేష్ గౌడ్ మొత్తుకున్నా అధికారులు వినలేదు. లోన్ క్లోజ్ చేస్తున్నట్లు నోటీసులు జారీ చేస్తూ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి దిగారు.
న్యాయం కోసం హైకోర్టుకు…
స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం తోడవ్వడంతో బాధితుడు రాజేష్ గౌడ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చివరకు తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఇచ్చిన నోటీసులను సాక్ష్యంగా తీసుకుని తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. చనిపోయిన వ్యక్తిపై లోన్ ఎలా మంజూరు చేస్తారని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై హైకోర్టు దిశానిర్దేశంతో లోతైన విచారణ కొనసాగుతోంది. సాక్ష్యాలు స్పష్టంగా ఉండటంతో బ్యాంకు అధికారులకు భారీ షాక్ తగిలినట్టయింది..
ALSO READ: HRC: చైనా మాంజాపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. సీపీ సజ్జనార్కు నోటీసులు