కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం భర్త పెడుతున్న వేధింపులను తాళలేక, కన్నవారికి భారం కాలేక ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కావ్య (22)కు, పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన శ్రావణ్ అనే యువకుడితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో కావ్య తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి సుమారు 15 లక్షల రూపాయల వరకట్నంతో పాటు.. ఇతర పెట్టుపోతలను శ్రావణ్కు సమర్పించారు. వివాహం జరిగిన కొత్తలో వీరి సంసారం సాఫీగానే సాగినప్పటికీ, కొద్దిరోజులకే శ్రావణ్ అసలు స్వరూపం బయటపడింది.
అదనపు కట్నం తీసుకురావాలంటూ శ్రావణ్ కావ్యను శారీరకంగా, మానసికగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై పలుమార్లు కుటుంబ సభ్యులు, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించారు. పెద్దలు శ్రావణ్కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. రోజురోజుకు వేధింపులు మితిమీరిపోవడంతో కావ్య తీవ్ర మనోవేదనకు గురైంది. తన పుట్టింటి వారు ఇప్పటికే భారీగా కట్నం ఇచ్చారని, మళ్లీ వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, భర్త వేధింపులు భరించలేక తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కావ్య ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు, బంధువులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కావ్య మృతితో మొట్లపల్లి, రాఘవపూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రావణ్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఒక నిండు ప్రాణం బలి కావడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కావ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.