Anesthesia Murder | ఇంట్లో ప్రేమించే భార్య పెట్టుకొని.. ఓ యువకుడు ఇద్దరు యువతుల మాయలో పడ్డాడు. అలా వివాహేతర సంబంధం కాస్త హత్యకు దాడి తీసింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది.
ఒడిశా రాజధాని భువనేశ్వర నగరంలో ప్రభుత్వ ఆస్పత్రిలో నెల రోజుల క్రితం ఒక యువకుడు తన భార్య ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని అపస్మారక స్థితిలో ఉన్న ఒక యువతిని తీసుకొని వచ్చాడు. అయితే ఆ యువతికి అప్పటికే మరణించిందని డాక్టర్లు చెప్పారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పంపించారు. ఇటీవలే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో ఆ యువతి మరణం మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ వల్ల జరిగిందని తేలింది. దీంతో పోలీసులు యువతి హత్య చేయబడిందని అనుమానించి ఆమె భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో ఇదంతా వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్య అని తేలింది.
పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వర నగరానికి చెందిన ప్రదీప్ సాహా (24) అనే యువకుడు ఒక ఆస్పత్రిలో ఫార్మసిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్పత్రిలో పనిచేసే రోజీ అనే నర్సుతో ప్రదీప్ ప్రేమలో పడ్డాడు. కానీ ప్రదీప్ తల్లిదండ్రులు 2020 సంవత్సరంలో శుభశ్రీ అనే యువతితో వివాహం జరిపించారు. అయితే తన పెళ్లి విషయాన్ని రోజీకి చెప్పకుండా ప్రదీప్ దాచాడు. కొన్ని రోజుల తరువాత రోజీకి ఈ విషయం తెలవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తరువాత రోజీ.. ప్రదీప్ తో బ్రేకప్ చేసుకొని వెళ్లిపోయింది.
Also Read: భార్యాబాధితుడు.. పిల్లలతో సహా ఆత్మహత్య.. ఏడుస్తూ వీడియో
మరోవైపు ప్రదీప్ తన భార్య శుభశ్రీని చిత్రహింసలు పెట్టవాడు. ఆమె ఎంతో సహనంతో తన భర్తను ప్రేమించేది. అయినా ఆమెను ప్రదీప్ చితకబాదేవాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో కొత్తగా ఇజితా అనే నర్సు వచ్చింది. ప్రదీప్, ఇజితా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. నర్సు ఇజితా మరెవరో కాదు.. నర్సు రోజీకి స్నేహితురాలే.
ఈ క్రమంలో నర్సు రోజీ కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చింది. ప్రదీప్ ని వదిలి ఉండలేనని చెప్పింది. అలా ప్రదీప్.. నర్సు ఇజితా, నర్సు రోజీ ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ముగ్గురూ కలిసి శుభశ్రీని అంతం చేయాలని ప్లాన్ చేశారు.
ప్లాన్ ప్రకారం.. ప్రదీప్ తన భార్య శుభశ్రీని నర్సు రోజీ ఇంటికి పార్టీ ఉందని తీసుకొని వచ్చాడు. అక్కడ నర్సు ఇజితా, నర్సు రోజీ ఆమెకు హై డోస్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ప్రభావం కారణంగా శుభశ్రీ స్పృహ కోల్పోయింది. కాసేపు తరువాత శుభశ్రీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇదంతా పూర్తి అయిన తరువాత ప్రదీప్ ఏమీ తెలియనట్లు తన భార్య శవం తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్లకు తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని మొసలి కన్నీరు కార్చాడు. కానీ డాక్టర్లకు అనుమానం కలిగి పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ వల్లనే శుభ శ్రీ మరణించిందని తేలడంతో పోలీసులు ప్రదీప్ ని అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించారు. దీంతో ప్రదీప్ హత్య ఎలా జరిగిందో వివరించాడు.
పోలీసులు శుభ్రశ్రీ హత్య కేసులో నర్సు ఇజితా అరెస్ట్ చేశారు. కానీ నర్సు రోజీ పరారీలో ఉంది. పోలీసులు నర్సు రోజీ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు.