Hyderabad: హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెలు పగిలే విషాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఆరేళ్ల చిన్నారి కామాంధుడి పాశవికానికి బలైపోయింది. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మబలికిన ‘బూసిరావు’ అనే వ్యక్తి, ఆ పసిగుడ్డును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, తన పాపం బయటపడుతుందనే భయంతో ఆ చిన్నారిని ప్రాణాలతో మట్టుబెట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలను నింపుతోంది.
పోలీసుల ప్రవేశం.. బయటపడ్డ నిజాలు..
అయితే నిన్న సాయంత్రం ఆటలాడుకుంటూ కనిపించకుండా పోయిన చిన్నారి కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి 10 గంటల సమయంలో నార్సింగి పోలీసులను ఆశ్రయించగా, మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా, నిందితుడు పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు లభ్యమయ్యాయి. ఆ ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, రాత్రి ఒంటి గంట సమయంలో మూసీ నది సమీపంలో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూపించాడు.
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు..
కళ్లముందే తిరుగుతూ సందడి చేసిన కన్నకూతురు నిర్జీవంగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఉపాధి కోసం సుదూర ప్రాంతం నుండి వస్తే, తమ బిడ్డకు ఇలాంటి గతి పడుతుందని ఊహించలేదని వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే బిడ్డకు జరగకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిపై రేప్, మర్డర్ కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
నార్సింగి ఘటన వెలుగులోకి రావడంతో, నెల క్రితం మదనపల్లెలో జరిగిన ఇలాంటి ఉదంతమే అందరికీ గుర్తుకొస్తోంది. అక్కడ ఏడేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడిన కులవర్ధన్ అనే నిందితుడు, ఘటన జరిగిన మరుసటి రోజే చెరువులో శవమై తేలడం అప్పట్లో సంచలనమైంది. బాధితురాలి కుటుంబానికి అక్కడ తక్షణ న్యాయం జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు నార్సింగి కేసులో కూడా నిందితుడికి అటువంటి కఠినమైన శిక్షే పడాలని, చట్టం తన పని తాను చేయడమే కాకుండా, నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టేలా చర్యలు ఉండాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.
Also Read: ఎంతపని చేశావమ్మా! తండ్రితో క్లోజ్గా ఉన్నారని.. కూతురిని కత్తితో పొడిచి, ఈ తర్వాత..
సైబరాబాద్ పోలీసులు ఏం చేయబోతున్నారు?
ప్రస్తుతం అందరి దృష్టి సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, తెలంగాణ పోలీసుల తదుపరి చర్యలపైనే ఉంది. ఇలాంటి ఘోర కలిని సమాజం సహించదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ జరిపి నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూడాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండే తెలంగాణ పోలీసులు, ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
మరో అమానుషం.. ఆరేళ్ల బాలికను అత్యాచారం, హత్య
హైదరాబాద్-నార్సింగిలో దారుణం
చాక్లెట్ ఇస్తానని నమ్మించి బాలికను తీసుకెళ్లిన కామాంధుడు
అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన నిందితుడు
నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు
సీసీ ఫుటేజ్… pic.twitter.com/s729ch7qnQ
— BIG TV Breaking News (@bigtvtelugu) March 16, 2026