Thoothukudi Gang Rape: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో మానవత్వం మచ్ఛపడే దారుణ ఘటన చోటుచేసుకుంది. పని మానేసి వెళ్తున్నారనే కోపంతో ఒక వలస కూలీ దంపతులపై కాంట్రాక్టర్, మరో ఇద్దరు మైనర్లు పగబట్టారు. వారిని అటవీ ప్రాంతానికి ఎత్తుకెళ్లి, భర్తపై దాడి చేసి, అతడి కళ్ల ముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 16, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు కూడా ఉండటం గమనార్హం.
పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన బాధితురాలు (24), ఆమె భర్త తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం తాలూకా అరసర్కులం ప్రాంతంలోని ఒక ఇటుకల తయారీ కేంద్రంలో పని చేసేవారు. అయితే అక్కడ కనీస వసతులు లేకపోవడం, తక్కువ వేతనాలు ఇస్తుండటంతో వారు పని మానేసి కేరళ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో దంపతులు ఆటోలో వెళ్తుండగా, విషయం తెలుసుకున్న లేబర్ కాంట్రాక్టర్ మరో ఇద్దరు మైనర్ బాలురతో కలిసి బైక్పై వారిని వెంబడించాడు. మార్గమధ్యలో ఆటోను అడ్డగించి, ఆ దంపతులు ఫ్యాక్టరీలో డబ్బు దొంగిలించారంటూ ఆటో డ్రైవర్ను నమ్మించారు. మాట్లాడాలని చెప్పి వారిని బలవంతంగా సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లారు.
అక్కడ భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం నిస్సహాయ స్థితిలో ఉన్న భర్త చూస్తుండగానే ఆ ముగ్గురు మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తర్వాత వారిని రోడ్డు పక్కన వదిలేసి పరారయ్యారు. గాయపడిన దంపతులు చికిత్స కోసం తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీవైకుంఠం మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. తూత్తుకుడి ఎస్పీ ఆల్బర్ట్ జాన్ ఆదేశాలతో పోలీసులు త్వరితగతిన స్పందించి సోమవారం ఉదయం నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన కాంట్రాక్టర్ను రిమాండ్కు తరలించగా, ఇద్దరు మైనర్లను బాలల సంరక్షణ కేంద్రానికి పంపించారు.