Tragic Incident: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీతండాలోని కొత్వాల్ చెరువులో ఇద్దరు విద్యార్థులు చెరువులో పడి మృతి చెందారు. మహేశ్వరం మండలం కేసితండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కేసితండాకు చెందిన రిషి(7),బద్రినాథ్(8) అనే ఇద్దరు విద్యార్థులు మరో బాలుడితో కలిసి మధ్యాహ్న సమయంలో కొత్వాల్ చెరువు దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లారు. ఆడుకునే క్రమంలో రిషి, బద్రినాథ్ ఇద్దరు విద్యార్థులు చెరువులో మునిగిపోయారు.
Also Read: Tragic Incident: ట్రైన్ లో నుంచి దూసుకొచ్చిన టెంకాయ.. ట్రాక్ పక్కన నడుస్తున్న వ్యక్తి తలకు తగిలి..
ఈ ఘటనను గమనించిన మరో బాలుడు భయంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు మహేశ్వరం పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో కొత్వాల్ చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి విద్యార్థుల మృతదేహాలను చెరువులో నుండి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కేసి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరమర్శించారు.
Also Read: Saudi Airlines Incident: మరో విమానంలో మంటలు.. ఫ్లైయిట్లో 250 మంది..?