Devotees Prayers On Occasion Of Sri Ram Navami Across Country: దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రామాలయాలు వేద మంత్రోచ్ఛరణలతో మార్మోగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న రాములోరి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఒక్క రోజు ముందుగానే ఆలయాలను ముస్తాబు చేశారు అధికారులు.వాడ వాడలా స్వామి వారి శోభా యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చైత్ర శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. శ్రీరాముడు ఈ పవిత్రమైన రోజునే జన్మించాడు కాబట్టి, దేశం మొత్తం ఈ రోజు శ్రీరామ నవమిని అత్యంత వైభవంగా జరుపుకుంటోంది.
అయోధ్యలో రామ నవమి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయోధ్య రామాలయంలో తొలి సారి శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తుండగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. వేకువజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రామయ్యను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రామ్ లల్లాకు ఉదయం నుంచే అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. శ్రీ రామనవమి సందర్భంగా అయోధ్యకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రస్టు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు.
బెంగుళూరులోని కోదండ రామాలయంలో భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచే స్వామి వారిని దర్శంచుకుంటున్నారు. ఏకపత్నీవ్రతుడైన రాముడు లోకానికంతటికీ ఆదర్శవంతుడు. సీతా రాముల కళ్యాణం జరిపేందుకు ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పండగ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Also Read: నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు.. 22న కల్యాణం
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో జగదబిరాముని కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది భక్తుల నడుమ మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భద్రాద్రి రామ నామ స్మరణలతో మార్మోగుతోంది.
ఏపీలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను కన్నల పండగగా నిర్వహించనున్నారు. శ్రీ రాముడి కళ్యాణానికి ఏపీ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివస్తారు. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవగా.. ఈ నెల 26వరకూ జరగనున్నాయి. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.