Rana Naidu Web Series: ఓటీటీ వేదికలు శృతి మించిన శృంగారంతో, బూతు పురాణంతో నిండిపోతున్నాయంటూ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించిన వేళ.. బిగ్ టీవీ ఛానెల్ ఏర్పాటు చేసిన డిబెట్ లో సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి. ముఖ్యంగా, నెట్ఫ్లిక్స్లో విడుదలైన రానా దగ్గుబాటి, వెంకటేష్ నటించిన “రానా నాయుడు” వెబ్ సిరీస్లోని శ్రుతిమించిన అడల్ట్ కంటెంట్ చర్చకు కేంద్ర బిందువైంది. ఈ డిబేట్ లో మహిళా న్యాయవాది ప్రసన్న ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
“తాతలు, తండ్రులు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దగ్గుబాటి కుటుంబం.. నేడు డాలర్ల దాహానికి కళ్లు మూసుకుందా?” అంటూ ఆమె తన ఆవేదనను ప్రశ్న రూపంలో సంధించారు. “వెంకటేష్ గారు ఒక తండ్రి లాంటి వారు, రానా ఒక కొడుకు లాంటి వారు. అలాంటి పవిత్రమైన బంధాన్ని కూడా విస్మరించి, కేవలం డిజిటల్ తెరపై కాసులు కురిపించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారా? అభిమానులు తమ గుండెల్లో పెట్టుకున్న హీరోలు ఇలాంటి దిగజారుడు పాత్రల్లో నటించడం ఎంతవరకు సమంజసం?” అని ఆమె నిలదీశారు. ఆమె గొంతులో ఆవేదన, ఆగ్రహం కలగలసి వినిపించాయి.
ఒక మంచి పరిణామం..
మరింత ఘాటుగా మాట్లాడుతూ.. “ఓటీటీ ఫ్లాట్ఫామ్లు ఒకప్పుడు విభిన్నమైన, ఆలోచింపజేసే కంటెంట్కు వేదికగా ఉండేవి. కానీ ఇప్పుడు యువతను మభ్యపెట్టేందుకు, వారిని తమకు బానిసలుగా చేసుకునేందుకు చౌకబారు శృంగారం, వికృతమైన హింస, అసభ్య పదజాలం ప్రధాన ఆయుధాలుగా మారాయి. దీనివల్ల నేటి యువతరం ఆలోచనా విధానం, వారి మానసిక స్థితి ఎంతగా దిగజారుతుందో ఊహించగలరా? సుప్రీంకోర్టు కళ్లు తెరిచి ఈ విషయంపై స్పందించడం ఒక మంచి పరిణామం. ఓటీటీ సంస్థలు తమ బాధ్యతను గుర్తించాలి. కేవలం వ్యూస్, సబ్స్క్రిప్షన్ల కోసం సంస్కృతిని, విలువలను కాలరాయడం దుర్మార్గం” అని ఆమె ఉద్వేగంగా అన్నారు.
ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఇతర విశ్లేషకులు సైతం ఓటీటీ కంటెంట్పై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు నియంత్రణ అవసరమని గట్టిగా వాదించగా, మరికొందరు కళాత్మక స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న అరాచకాన్ని ఖండించారు. అయితే, మహిళా అడ్వకేట్ వాదన మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఒక ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన హీరోలు సైతం డబ్బు కోసం దిగజారడం సమాజానికి ఒక తప్పుడు సంకేతం ఇస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విలువలు ముఖ్యం ..
చివరిగా ఆమె మాట్లాడుతూ.. డబ్బు అనేది జీవితంలో ముఖ్యమైనదే కావచ్చు. కానీ, అది విలువలను మించినది కాదు. దగ్గుబాటి వంటి పేరున్న కుటుంబం ఇలాంటి చౌకబారు కంటెంట్లో నటించడం కేవలం వారి వ్యక్తిగత పరువుకే కాదు, మొత్తం తెలుగు సినీ పరిశ్రమ పరువుకు భంగం కలిగిస్తుంది. ప్రేక్షకులు కూడా దీనిపై గట్టిగా స్పందించాలి. మంచి కంటెంట్ను మాత్రమే ఆదరించాలి. అప్పుడే ఇలాంటి దిగజారుడు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయగలం” అని పిలుపునిచ్చారు.
సుప్రీంకోర్టు హెచ్చరికల తర్వాత ఓటీటీ ఫ్లాట్ఫామ్లలోని కంటెంట్ విషయంలో జరుగుతున్న ఈ చర్చ రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. డబ్బు కోసం విలువలను పణంగా పెట్టే ధోరణికి ఇకనైనా అడ్డుకట్ట పడుతుందా? లేదా ఈ దిగజారుడు యథావిధిగా కొనసాగుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.
HIT3: హీరోతో పాటు హీరోయిన్ ఫైట్ చేశారు… ఇది విన్నారా