Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) కు ఇంకా బ్యాడ్ టైమ్ నడుస్తోంది అంటూ మీడియా ముఖంగా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా శ్రీతేజ్ (Sritej)ను పరామర్శించడానికి వెళ్ళిన ఆయన, ఆ బాలుడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అనంతరం ఇంకా ఎన్నాళ్ళు బన్నీ జాతకం ఇలాగే ఉండబోతోందో వెల్లడించారు.
పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి (Venu Swamy) రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫుల్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఆయన చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో వేణు స్వామిని పలువురు ప్రముఖులు సైతం ఫాలో అవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సమంత – నాగ చైతన్యల వైవాహిక జీవితం సాఫీగా సాగదు, మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుందని ముందే చెప్పి షాక్ ఇచ్చారు. అలాగే ప్రభాస్ రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలు డిజాస్టర్ అవుతాయని చెప్పి కొంతవరకు నెగిటివిటీని మూట కట్టుకున్నప్పటికీ, ఆయన చెప్పింది నిజం కావడంతో వేణు స్వామికి పాపులారిటీ మరింత పెరిగింది. దీంతో ఆయన చేత స్పెషల్ గా పూజలు చేయించుకోవడం స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత పలువురు రాజకీయ నాయకుల గురించి జ్యోతిష్యం కూడా చెప్పి వార్తల్లో నిలిచారు. అయితే కొన్నిసార్లు ముఖ్యంగా ఎన్నికల విషయంలో ఆయన చెప్పిన జాతకం ఫెయిల్ కావడంతో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత సైలెంట్ అయిన వేణు స్వామి రీసెంట్ గా మళ్లీ తనదైన శైలిలో జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టారు. తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి, చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను వేణు స్వామి పరామర్శించారు. డిసెంబర్ 25న కిమ్స్ ఆస్పత్రికి వెళ్ళిన ఆయన రేవతి భర్త భాస్కర్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
భాస్కర్ కూతురికి రెండు లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన వేణు స్వామి (Venu Swamy)… అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆయనకు శని ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ జాతకం వచ్చే ఏడాది మార్చ్ 29 వరకు బాగాలేదని, కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏం జరిగినా జాతకం ప్రకారమే జరుగుతుందని, బన్నీకి కూడా అదే జరిగిందని అన్నారాయన. అలాగే తన సొంత ఖర్చులతో బాబు కోసం మృత్యుంజయ హోమం చేస్తానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఇక రీసెంట్ గా తనని గెలికినందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి గతి పట్టిందని షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి, ఇప్పుడు మాత్రం తాను ఎన్నో సినిమాలకు ముహూర్తం పెట్టాను కాబట్టి, తాను కూడా సినిమా వాడినేనని ప్రకటించుకుంటూ ఆ పాపకు సాయం చేయడం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఆయన సినీ ప్రముఖులతో కలిసి శ్రీతేజ్ ను పరామర్శించడానికి వచ్చాడు.