Dil Raju : తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలేమి రాలేదు. ఊహించిన విధంగానే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్యానెల్ సునాయాసంగా విజయం సాధించింది. దిల్ రాజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్గా ప్రసన్న కుమార్ ను ఎన్నుకున్నారు.మొత్తం 48 ఓట్లలో దిల్ రాజుకు 31 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ప్రెసిడెంట్గా గెలిచారు.
ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో మొత్తం ఓట్లు 891 ఉండగా.. దిల్ రాజు ప్యానల్ కు 563 ఓట్లు వచ్చాయి. సి. కల్యాణ్ ప్యానల్ కు 497 ఓట్లు మాత్రమే పడ్డాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ లో 12 మంది సభ్యులకుగాను దిల్ రాజు ప్యానల్ నుంచి ఏడుగురు విజయం సాధించారు. దిల్ రాజు , దామోదర ప్రసాద్, వడ్లపాటి మోహన్ , పద్మిని, స్రవంతి రవికిషోర్ , యలమంచిలి రవి, మోహన్ గౌడ్ ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి గెలిచారు. స్టూడియో సెక్టార్ లో నలుగురు సభ్యులుకుగాను.. ముగ్గురు దిల్ రాజు ప్యానల్ నుంచి విజయం సాధించారు.
డిస్టిబ్యూటర్స్ సెక్టార్ లో మాత్రం రెండు ప్యానల్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇందులో దిల్ రాజు, సి. కల్యాణ్ ప్యానళ్ల నుంచి ఆరుగురు సభ్యుల చొప్పున గెలుపొందారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్ లో చెరో 8 మంది సభ్యులు గెలిచారు.