Gaddar Film awards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ అవార్డు (Gaddar Film awards) కమిటీ సభ్యులతో కలిసి శనివారం భేటీ అయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) గద్దర్ అవార్డుల విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే అక్టోబర్ 14న కమిటీ సభ్యులతో భేటీ అయిన భట్టి తాజాగా మరోసారి సమావేశమై, సినిమా నిర్మాణంలో హైదరాబాద్ ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని వెల్లడించారు. అంతేకాకుండా గద్దర్ అవార్డుల పంపిణీకి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు.
ఉగాదికి గద్దర్ అవార్డులు
ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను (Gaddar Film awards) అందజేయాలని తాజా భేటీలో ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ “తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ ఈ అవార్డులను అందజేయనున్నాము. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆ అవార్డులను అందజేస్తున్నాము’ అని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో చర్చించిన అంశాలు
ఈ సమావేశంలో టీఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు (Dil Raju), హరీశ్ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, గుమ్మడి వెన్నెల, అల్లాణి శ్రీధర్, వేణు, ఎండీ డాక్టర్ హరీశ్, ఈడీ కిషోర్బాబు, కమిటీ చైర్మన్ బీ నర్సింగ్రావు, కమిటీ సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. గద్దర్ అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ, నిబంధనలపై తాజాగా జరిగిన భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలి. కల్చరల్ ఐకాన్ గద్దర్ ప్రతిష్టను పెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలి. సినిమా నిర్మాణంలో హైదరాబాద్ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నాము” అని చెప్పుకొచ్చారు. ఫీచర్ ఫిల్మ్లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వబోతున్నారు. అవార్డులలో నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందజేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇకపై ప్రతి ఏడాది గద్దర్ అవార్డులు
పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసింది. కాబట్టే అవార్డుల పంపిణీ జరగలేదని, ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భట్టి అన్నారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి, గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవన్నట్టు ఆయన వెల్లడించారు.