Game Changer : పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)ని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలీదు కానీ, వరుసగా వివాదాలు చిక్కుకుంటుంది. రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రిలీజ్ అయ్యి, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాక కూడా వివాదాలు ఈ మూవీని వదలట్లేదు. తాజాగా మరోసారి ఈ మూవీలో నటించిన వందల మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కనీసం రెమ్యూనరేషన్ కూడా చెల్లించలేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు అయినట్టుగా తెలుస్తోంది.
అసలు వివాదం ఏంటంటే?
‘గేమ్ ఛేంజర్’ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సంగతి తెలిసింది. ఈ మూవీని దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ‘గేమ్ ఛేంజర్’ మూవీ నెగిటివ్ టాక్ తో నిర్మాతలకు ఊహించని నష్టాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో నటించినందుకు గానూ తమకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ పోలీస్ స్టేషన్లో ఈ మూవీ కో -డైరెక్టర్ పై క్యారెక్టర్ ఆర్టిస్టులు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది.
‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుంచి హైదరాబాద్ కి దాదాపు 350 మంది జూనియర్ ఆర్టిస్టులు వెళ్లారట. వారందరికీ కో-డైరెక్టర్ స్వర్గం శివ ఒక్కొక్కరికి రూ. 1200 చొప్పున ఇస్తామని ఒప్పుకున్నారట. అయితే ఈ డీల్ కు సంబంధించిన డబ్బును ఇవ్వట్లేదని గుంటూరు పోలీస్ స్టేషన్లో ఆర్టిస్ట్ తరుణ్ తో పాటు మరికొందరు కంప్లైంట్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ‘గేమ్ ఛేంజర్’ నిర్మాత దిల్ రాజు తమకు న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్త బయటకు రావడంతో ఈ మూవీ వందల కోట్ల బడ్జెట్ సినిమా. అలాంటిది జూనియర్ ఆర్టిస్టులకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం ఏంటి? అంటూ అందరూ షాక్ అవుతున్నారు. మరి నిర్మాత దిల్ రాజు ఈ వివాదంపై స్పందిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదే మొదటి వివాదం కాదు…
‘గేమ్ ఛేంజర్’ మూవీ మొదలైనప్పటి నుంచి వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. ముందుగా షూటింగ్ ఆలస్యం కావడం, రిలీజ్ డేట్ లో జాప్యం, ఆ తర్వాత తమిళనాడులో మూవీ రిలీజ్ సమస్యలు, రిలీజ్ అయ్యాక మూవీపై సెటైర్లు, నిర్మాత దిల్ రాజుతో పాటు సినిమా ఇండస్ట్రీపై ఐటీ దాడులు, ఇప్పుడేమో ఏకంగా కేసు…
మరో మూవీ వేదికపై నిర్మాత అల్లు అరవింద్ ‘గేమ్ ఛేంజర్’, ఐటీ దాడుల గురించి దిల్ రాజుపై సెటైరికల్ గా జోక్స్ పేల్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత చిరంజీవి ఈ మధ్య సినీ ఈవెంట్లు ‘గేమ్ ఛేంజర్’ ప్రస్తావన లేకుండా జరగట్లేదు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో నెక్స్ట్ డే అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పడం వంటివి జరిగాయి. ఇక ఇప్పుడేమో ఏకంగా వందల మందికి కో డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఎగ్గొట్టాడు అనే వార్త బయటకు రావడం, దీనిపై కేసు నమోదు కావడం గమనార్హం.