Sai Pallavi: నటించే సినిమాలు హిట్ అవుతున్నకొద్దీ రెమ్యునరేషన్ విషయంలో కూడా మార్పులు చేస్తుంటారు నటీనటులు. సినిమా సినిమాకు తమ రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతారు. చాలావరకు నిర్మాతలు కూడా హీరోహీరోయిన్ల డిమాండ్లకు అడ్డుచెప్పరు. అలా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్లో సాయి పల్లవి మాత్రమే అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంటుంది. అలాంటి సాయి పల్లవి కూడా ‘తండేల్’ కోసం తన కెరీర్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుందని ప్రస్తుతం టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటుండడంతో సాయి పల్లవి కూడా తన పారితోషికాన్ని పెంచేసిందట.
సక్సెస్ స్ట్రీక్
తాము నటించే సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. తమ నటనతో ఆకట్టుకునే నటీనటులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో సాయి పల్లవి ముందుంటుంది. కమర్షియల్ సినిమాలను ఎంచుకున్నా కూడా అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉందా లేదా అన్నదే ఆలోచిస్తుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం తన పాత్ర, అందులో తన నటనపైనే ఫోకస్ చేస్తుంది. అందుకే సాయి పల్లవి యాక్టింగ్ అంటే చాలామంది ప్రేక్షకులకు ఇష్టం. తనపై అందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ప్రస్తుతం తను తన సక్సెస్ స్ట్రీక్ను కొనసాగిస్తూ దూసుకుపోతోంది. త్వరలోనే ‘తండేల్’తో ప్రేక్షకులను పలకరించనుంది.
అందరి చూపు తనవైపే
చందూ మోండేటి దర్శకత్వంలో నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన చిత్రమే ‘తండేల్’ (Thandel). ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఎన్నో వాయిదాలు పడిన తర్వాత ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై హైప్ పెంచేశాయి. ‘తండేల్’ అనేది మత్స్యకారుల కథ. అందులో నాగచైతన్య కూడా ఒక మత్స్యకారుడిగానే కనిపించినా సాయి పల్లవి సైతం తన నటనతో అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. అందుకే ఈ మూవీ కోసం తను రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్టు సమాచారం.
Also Read: ప్రమోషన్స్ కోసం ఏకంగా దానినే వాడుకుంటున్న చైతూ.. మీరు మారిపోయారు బాసూ..!
రెమ్యునరేషన్ పెంచేసింది
సాయి పల్లవి (Sai Pallavi) చివరిగా శివకార్తికేయన్తో ‘అమరన్’ అనే సినిమాలో కనిపించింది. ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించి బ్లాక్బస్టర్ అందుకుంది. అయితే ఆ సినిమా కోసం సాయి పల్లవి రూ.3 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. ‘తండేల్’ కోసం ప్రత్యేకంగా తను రూ.2 కోట్లు ఎక్స్ట్రా పారితోషికం ఛార్జ్ చేసిందనే వార్త ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన తన ఫ్యాన్స్ మాత్రం సాయి పల్లవి నటనకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తక్కువే అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ‘తండేల్’ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది సాయి పల్లవి. ఇందులో కూడా తన నేచురల్ యాక్టింగ్తో అందరినీ ఫిదా చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.