Keerthy Suresh:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత(Samantha) పై మరొకసారి మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) ప్రశంసలు కురిపించారు. సమంత తనకు సోదరితో సమానమని అన్న ఈమె, సమంతపై ప్రశంసలు కురిపిస్తూ పలు కామెంట్లు చేశారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీమణులలో సమంత, కీర్తి సురేష్ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే సమంత పై తనకున్న ఇష్టాన్ని పలు సందర్భాలలో వెల్లడించిన కీర్తి సురేష్, ఇప్పుడు మరొకసారి ప్రశంసలు కురిపించారు.
సమంత నా సోదరితో సమానం..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు.. కీర్తి సురేష్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్ పంపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఈ వాయిస్ మెసేజ్ విన్న తర్వాత నెటిజన్స్ ,అభిమానులు కూడా వీరిద్దరి మధ్య ఇంత మంచి సాన్నిహిత్యం ఉందా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ పంపిన వాయిస్ మెసేజ్ లో ఏముంది అనే విషయానికి వస్తే.. “సమంత నీతో ఉన్న అనుబంధాన్ని నేను ఎలా వర్ణించాలి. అసలు ఎక్కడినుంచి ప్రారంభించాలో కూడా తెలియడం లేదు. మనం కలిసింది కేవలం కొన్నిసార్లే అయినా ఎన్నో ఏళ్ల క్రితం నుంచే కలిసి ఉన్నట్టు అనిపిస్తోంది. ఏ విషయంలో అయినా సరే నువ్వు సూటిగా వ్యవహరిస్తావు. మహిళల కోసం ఎప్పుడూ ముందుంటావు. నాకు ఎన్నో విషయాలలో స్ఫూర్తిని ఇస్తూ ఉంటావు. నిన్ను స్నేహితురాలు అనడం కంటే నా సోదరి అని పిలవడం ఎంతో ఇష్టం. ముఖ్యంగా నువ్వు నీ జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నావు ఇలాంటి పోరాటాలు చేయడం కేవలం నీకు మాత్రమే సాధ్యం. జీవితం నీకు ఎన్ని సవాళ్లు విసిరినా.. రెట్టింపు బలంతో వాటిని ఎదుర్కొంటూ ముందడుగు వేస్తున్నావు. నిన్ను చూస్తుంటే ఈ విషయంలో చాలా గర్వంగా ఉంటుంది.” అంటూ వాయిస్ మెసేజ్ పంపించారు కీర్తి సురేష్. ఇక దీనిపై స్పందించిన సమంత.. కీర్తి సురేష్ మాటలకు పులకించిపోయి ధన్యవాదాలు అని కూడా తెలిపారు.
బాలీవుడ్ లోకి వెళ్లడానికి సమంత కారణం..
కీర్తి సురేష్ విషయానికొస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె, తెలుగులో ‘నేను శైలజ’ అనే సినిమాతో హీరోయిన్ గా మారి మంచి పేరు దక్కించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన ఈమెకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సినిమాతో భారీ పాపులారిటీ లభించింది. అంతేకాదు ఈ సినిమాతో ఈమెకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇక ఇటీవలే బాలీవుడ్ లోకి బేబీ జాన్ అనే సినిమాతో అడుగుపెట్టింది కీర్తి సురేష్. అయితే ఈ అవకాశం తనకు రావడానికి కారణం సమంత అని ఇటీవల చెప్పుకొచ్చింది. ఇకపోతే తమిళంలో సమంత నటించిన ‘తేరి’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని మేకర్స్ భావించినప్పుడు కీర్తిని తీసుకోవాలని సమంత కోరిందట. అలా ‘బేబీ జాన్’ సినిమాలో కీర్తి సురేష్ కి అవకాశం వచ్చింది. దీనిపై కూడా స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు కీర్తి సురేష్.