Naresh: అలనాటి నటి విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నరేష్. కెరీర్ మొదట్లో కామెడీ హీరోగా గుర్తుండిపోయే సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాడు. ఇప్పుడు తండ్రి పాత్రలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. నరేష్ ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్ కూడా నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. ఇంటర్వ్యూల్లో కూడా కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు నరేష్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్.. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఉన్న కామెడీ హీరోలతో తనను తాను పోలుస్తూ మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ కంటే తానే బెటర్ యాక్టర్ అని అన్నారు.
రాజకీయాల్లోకి వెళ్లాను
‘‘అప్పట్లో కామెడీ హీరోలంటే నేను, రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మాత్రమే. చంద్రమోహన్ మాకు అన్నయ్యతో సమానం. నాకు పోటీ మాత్రం రాజేంద్ర ప్రసాదే. నాకు చాలా గొప్ప నటుడు, మంచి కమెడియన్. నాలో, రాజేంద్ర ప్రసాద్ ఎవరు బెటర్ యాక్టర్ అంటే చెప్పలేం. ఆయన చేసిన సినిమాలు నేను చేయలేను. నేను చేసిన సినిమాలు ఆయన చేయలేడు. ఎవరిది వాళ్లదే. నాకు నరేషే ఇష్టం. ముందు నన్ను నేను ఇష్టపడాలి కదా. రాజేంద్ర ప్రసాద్ పూర్తిగా కామెడీపైనే ఫోకస్ చేశాడు. కామెడీపై ఆయన చేసినన్ని సినిమాలు ఎవరూ చేయలేరు. ఆయన అలా సాగుతున్నారు. నేను అలా కాదు.. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లాను’’ అని చెప్పుకొచ్చారు నరేష్.
నటితో మళ్లీ పెళ్లి
‘‘రాజకీయాల నుండి వచ్చిన తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించాను. వైవిధ్యభరితమైన పాత్రలు చేశాను’’ అని గుర్తుచేసుకున్నారు నరేష్. ఒక టీవీ ఆర్టిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించిన నరేష్.. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించారు. తన ప్రతీ సినిమా.. అందులో ప్రతీ క్యారెక్టర్ గుర్తుండిపోయేలా చేశారు. ప్రతీ సినిమాతో నవ్వించడం మాత్రమే కాదు.. అప్పుడప్పుడు తన యాక్టింగ్తో ఏడిపించారు కూడా నరేష్. తండ్రి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఎమోషనల్ కూడా చేశారు. అలాంటి తన పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు ఇదివరకు పెద్దగా తెలిసేది కాదు.. కానీ పవిత్ర లోకేశ్ అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ ప్రేక్షకుల్లో హైలెట్ అయ్యింది.
Also Read: ప్లాన్ చేసి తొలగించారు.. సుశాంత్ మరణంపై స్పందించిన నటుడు
స్పీడ్ తగ్గింది
1972లో విడుదలయిన ‘పండటి కాపురం’ అనే సినిమాతో మొదటిసారి వెండితెరపై కనిపించారు నరేష్ (Naresh). తన తండ్రి కృష్ణ హీరోగా నటించిన ‘దేవదాసు’లో కూడా చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ తర్వాత విడుదలయిన ‘నాలుగు స్తంభాలాట’తో హీరోగా మారారు. ఆపై వెంటవెంటనే పలు ఫ్యామిలీ, కామెడీ చిత్రాల్లో హీరోగా నటించారు. ఒకే ఏడాది దాదాపు అరడజనుకు పైగా సినిమాలు విడుదల చేసిన నరేష్.. 1998 తర్వాత కాస్త స్పీడ్ తగ్గించారు. ఆపై ఏడాదికి ఒక మూవీతోనే ముందుకెళ్లారు. అప్పుడు నటించిన సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో మాత్రమే కనిపించారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో చాలా యాక్టివ్ అయ్యారు నరేష్.