
Sharwanand : టాలీవుడ్ హీరో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కు బై చెప్పాడు. తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టాడు. రక్షితా రెడ్డి అనే యువతిని వివాహమాడాడు.

శనివారం రాత్రి శర్వానంద్ పెళ్లి వేడుక జైపుర్లోని లీలా ప్యాలెస్ లో వైభవంగా జరిగింది. రాత్రి 11 గంటలకు రక్షితారెడ్డి మెడలో ఈ హీరో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. రెండు రోజులపాటు వివాహ వేడుకలు నిర్వహించారు.

పెళ్లి వేడుకలో హీరోలు రామ్చరణ్, సిద్ధార్థ్, హీరోయిన్ ఆదితిరావు హైదరీ సహా పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియా యూజర్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

శర్వానంద్, రక్షితారెడ్డి ఎంగేజ్ మెంట్ ఈ ఏడాది జనవరిలో జరిగింది. నిశ్చితార్థం జరిగిన 5 నెలల తర్వాత ఈ జంట పెళ్లి చేసుకుంది.