Social Activist Devi: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తున్నాయి. సీనియర్ బ్యూటీ అన్షును స్టేజిమీద ..” అన్షు కొంచెం సన్నబడింది. నేనే కొద్దిగా తిని పెంచమ్మా.. తెలుగుకు సరిపోదు. అన్ని కొంచెం ఎక్కువ సైజ్ లలో ఉండాలి” అని నోటికి ఏది వస్తే అది చెప్పేశాడు. ఒక మహిళను అలాంటి అభ్యంతరకరమైన భాషతో వర్ణించడం చాలా తప్పు అని నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. మహిళా సంఘాలు సైతం అతనిపై ఫైర్ అయ్యాయి. దీంతో తన తప్పు తెలుసుకున్న త్రినాథరావు మహిళలందరికీ క్షమాపణలు చెప్పుకొచ్చాడు.
ఇంకోపక్క అన్షు సైతం.. జరిగిన ఘటనపై స్పందించింది. త్రినాథరావు తన కుటుంబ సభ్యుడులా అని, ఆయన పై తనకు మంచి గౌరవం ఉందని.. టాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ కు ఇంతకంటే మంచి దర్శకుడు ఉండరేమో అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే త్రినాథరావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ యాక్టివిస్టులు మాత్రం గుర్రుగానే ఉన్నారు.
తాజాగా సోషల్ యాక్టివిస్ట్ దేవి ఈ ఘటనపై స్పందించింది. ఆ డైరెక్టర్ చేసింది ముమ్మాటికీ తప్పే అని, ఇలాంటివారు బాగా బలిసి, మదమెక్కి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యింది. కాలేజ్ గోడలపై అమ్మాయిలను ఏడ్పించేవాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్, నిర్మాతలు గా మారి, ఇలా స్టేజిమీద నోటికి ఏది వస్తే అది వాగుతున్నారని చెప్పుకొచ్చింది. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని, వారందరూ స్త్రీల శరీరాలతో వ్యాపారం చేస్తున్నారని మండిపడింది.
Actress Anshu : ఆ డైరెక్టర్ పై మన్మథుడు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. మంచోడే కానీ!
ఇండస్ట్రీలో స్త్రీల శరీరాలపై దోపిడీ జరుగుతుంది. అది కెమెరా కు ముందు వెనుక కూడా జరుగుతుంది. వీటిని నిర్ములించడానికి హై పవర్ కమీటీ వేస్తే దాన్ని కొత్త ప్రభుత్వం విడుదల చేయడం లేదు. గతంలో బాలయ్య.. అమ్మాయిలకు కడుపు చేయాలి అని ఏదో అన్నారు. ఇలాంటివి ఒకటి కాదు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా అతీగతీ లేకుండా ఉన్నాయి. ఎందుకంటే సినిమాలకు, రాజకీయాలకు ఒక అనుబంధం ఉంటుంది. అలాంటిందే మొన్న అల్లు అర్జున్ కేసులో కూడా కనిపించింది.
అసలు వీరందరూ మహిళలను మనుషులుగా చూడడం లేదు. అందరికీ వీరు ఓటు బ్యాంక్ లాగ మాత్రమే గుర్తొస్తున్నారా అని అడుగుతున్నాను. ఇలాంటివారిని అదుపులో పెట్టడానికే అధికారం ఉంది. పోలీసులు ఏం చేస్తున్నారు.. ? ఆకతాయిలను పట్టుకోవడానికే పోలీస్ ఫోర్స్ ఉంది. ఒక పరిశ్రమను నడుపుతున్నారు అంటే అందులో కొన్ని నియమాలు ఉంటాయి. నటన ఆమె చేయాల్సింది.. శరీరాలను చూపించాల్సిన అవసరం లేదు. శరీరాలను అమ్ముకోనే పరిశ్రమనా ఇది. పైకి చెప్పకపోయినా లోపల జరిగేది అదే.
మన తెలుగు ఇండస్ట్రీలో మెగా దురహంకారం ఉంది. కేవలం మగవాళ్ళనే హీరోలుగా చూపించి , వాడి కండలు, వాడి వీరత్వం, వాడి హింస.. ఇవే చూపించేది. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూడడం లేదా అంటే.. చూస్తున్నారు. హీరోయిన్ శరీరం నువ్వు అమ్ముతున్నావు.. ప్రేక్షకులు కొంటున్నారు. మహిళను ఒక అమ్ముకొనే సరుకుగా చూస్తున్నారు. ఆ సరుకుల్లో కూడా హీరోయిన్ల శరీరాలను హోల్ సేల్ గా అమ్మడం లేదు.. ముక్కలు ముక్కలుగా అమ్ముతున్నారు. కేవలం రెచ్చగొట్టే బాడీ పార్ట్స్ ను చూపిస్తూ రిటైల్ గా అమ్ముతున్నారు. ఈ సరుకును కొంటుంది ప్రేక్షకులు. వాళ్లు సాధారణ దృష్టిలో చూస్తున్నా కూడా ఆ చూపును వీరే మారుస్తున్నారు. ఇది మారాలి” అంటూ ఆమె చెప్పుకొచ్చింది” ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.