Allu Arjun : గత వారం హైదరాబాద్లో జరిగిన ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్లో మహిళ మృతికి సంబంధించిన కేసులో అల్లు అర్జున్ ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అయితే జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్న ఒక నటుడిని ఒక సామాన్యుడిలాగే ట్రీట్ చేసి, అరెస్ట్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా అల్లు అర్జున్ అరెస్టుపై టాలీవుడ్ మౌనంగా ఉంది. కానీ ఒకే ఒక్క స్టార్ హీరో మాత్రం ధైర్యం చేసి అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు.
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తాజాగా అల్లు అర్జున్ ని సమర్థిస్తూ తన అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్ తన నెక్స్ట్ మూవీ ‘బేబి జాన్’ ప్రమోషన్ కోసం జైపూర్ లో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో ‘పుష్ప 2’ తొక్కిసలాట వివాదాన్ని, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ “సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ప్రతి దానికి నటుడు బాధ్యత తీసుకోలేడు. ఈరోజు గురించి చూసుకుంటే ఈవెంట్ ను సినీ పోలీస్ చాలా బాగా ఏర్పాటు చేసింది. వాళ్లకు థాంక్స్ చెప్పాలి. అయితే జరిగిన వివాదం బాధాకరం. బాధితులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. కానీ అదే టైంలో ఒకరిపై మాత్రమే నింద వేయడం కరెక్ట్ కాదు” అంటూ వరుణ్ ధావన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అల్లు అర్జున్ అరెస్ట్పై బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ రియాక్షన్#AlluArjun #Bollywood #VarunDhawan #TeluguNews #bigtvcinema pic.twitter.com/4idGMZhGWq
— BIG TV Cinema (@BigtvCinema) December 13, 2024
అయితే ఇప్పటిదాకా అల్లు అర్జున్ అరెస్ట్ పై ఒక్క స్టార్ కూడా నోరు విప్పే ధైర్యం చేయలేదు. కనీసం ట్వీట్ కూడా వెయ్యలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ‘పుష్ప 2’ మూవీకి సంబంధించిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బన్నీ సన్నిహితులు, బంధువులు మాత్రమే పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. నిజానికి ఈ వివాదం ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది. అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తే బాధితురాలికి జరిగిన అన్యాయం కరెక్టే అన్న విధంగా సెలబ్రిటీలు రెస్పాండ్ అయ్యారు అన్న మాట వస్తుంది. సరే బాధితురాలికి సపోర్ట్ చేద్దాము అనుకుంటే తమ తోటి నటుడికి అన్యాయం చేసినట్టుగా అవుతుంది. అందుకేనేమో ఇండస్ట్రీలోని ఏ ఒక్క స్టార్ కూడా ఈ వివాదం పై ఇప్పటిదాకా స్పందించలేదు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి, నాగబాబు ఇద్దరూ అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో తన జోక్యం ఏమీ ఉండదని, పోలీసులు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఉన్న ఒకే ఒక్క హోప్ హైకోర్టులో నడుస్తున్న క్వాష్ పిటిషన్. మరి దీనిపై ఎలాంటి తీర్పు వస్తుంది అన్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.