Air India : ఎయిరిండియా సహా ఆరు ఎయిర్లైన్ కంపెనీలకు భారీ షాక్ తగిలింది. కరోనా లాక్ డౌన్ కాలంలో రద్దైన విమానాలకు సంబంధించి… ప్రయాణికులకు రీఫండ్లను చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన అమెరికా… తక్షణం రీఫండ్ చేయాలని ఆదేశిస్తూ… జరిమానా కూడా విధించింది.
అమెరికా రవాణా విభాగంలో రిఫండ్ పాలసీ… ఎయిరిండియా విధానాలకు పూర్తిభిన్నంగా ఉంటుంది. అమెరికాలో ఎయిర్లైన్ కంపెనీలు విమానాలు రద్దు చేయడం లేదా విమాన సమయాల్లో మార్పులు చేసినప్పుడు… ప్రయాణికుల టికెట్ ఛార్జీలను చట్టబద్ధంగా రీఫండ్ చేయాల్సి ఉంటుంది. అంతేతప్ప, ఓచర్ల రూపంలో రీఫండ్ చేస్తామంటే కుదరదు. కరోనా వల్ల లాక్ డౌన్ విధించిన సమయంలో అమెరికాకు వెళ్లొచ్చే పలు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. ఆయా విమానాల టికెట్లకు సంబంధించిన రీఫండ్ రాకపోవడంతో… ప్రయాణికులు అమెరికా రవాణా విభాగానికి ఫిర్యాదు చేశారు. దాంతో… ఆ ఫిర్యాదులను పరిష్కరించి ప్రయాణికులకు రీఫండ్ చేయాలని అమెరికా అధికారులు ఎయిరిండియాను కోరారు. అయితే, అప్పటికి ఇంకా టాటాల చేతుల్లోకి వెళ్లని ఎయిరిండియా… రీఫండ్ ప్రక్రియను ఆలస్యం చేసింది.
ఎయిరిండియా రీఫండ్ చేసిన తీరుపై దర్యాప్తు చేసిన అమెరికా అధికారులు… సంస్థ తీవ్ర అలసత్వం ప్రదర్శించిందని తేల్చారు. రీఫండ్ ఫిర్యాదుల్లో సగం పరిష్కరించడానికే 100 రోజులకు పైగా సమయం తీసుకుందని… ఆ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎయిరిండియా అప్డేట్ చేయలేదని నిర్ధారిస్తూ… జరిమానా కూడా విధించారు. రద్దైన విమానాల ఛార్జీలకు సంబంధించి ప్రయాణికులకు 121.5 మిలియన్ డాలర్లు… అంటే మన కరెన్సీలో రూ.988 కోట్లు రీఫండ్ చేయాలని… 1.4 మిలియన్ డాలర్ల జరిమానా… అంటే మన కరెన్సీలో రూ.11 కోట్ల ఫైన్ చెల్లించాలని ఎయిరిండియాను ఆదేశించారు… అమెరికా అధికారులు.
ఎయిరిండియాతో పాటు మరో ఐదు ఎయిర్లైన్ సంస్థలకు కూడా జరిమానా విధించింది… అమెరికా. అగ్రరాజ్యానికే చెందిన ఫ్రాంటియర్ ఎయిర్లైన్… 222 మిలియన్ డాలర్లు రీఫండ్ చేయాలి ఆదేశించి… మరో 2.2 మిలియన్ డాలర్ల పెనాల్టీ కూడా విధించింది. టీఏపీ పోర్చుగల్, ఏరో మెక్సికో, ఈఐ ఏఐ, అవియానికా సంస్థలకు కూడా రీఫండ్ విషయంలో షాక్ తప్పలేదు.