Balooch Attacks : రోజురోజుకు పాకిస్థాన్ సైన్యానికి బలూచ్ ఆర్మీ కొరకరాని కొయ్యలా తయారైంది. ఇప్పటికే.. వరుస దాడులతో పాక్ యంత్రాంగానికి నిద్ర లేకుండా చేస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. ఇప్పుడు తాజాగా జరిపిన దాడుల్లో 18 మంది పాక్ సైనికుల్ని హతమార్చాయి. ఈ విషయాన్ని పాక్ ఆర్మీనే స్వయంగా ప్రకటించింది. దీంతో.. తిరుగుబాటుదారులు ఏ స్థాయిలో బలపడుతున్నారో అర్థమవుతుంది అంటున్నారు.. ఆ ప్రాంతంలోని పరిణామాల్ని పరిశీలిస్తున్న విశ్లేషకులు.
పాకిస్థాన్లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఈ దారుణం జరిగినట్లుగా పాక్ ఆర్మీ ప్రకటించింది. భద్రతా సిబ్బంది, తిరుగుబాటు దారుల మధ్య భీకర పోరు జరగగా.. అందులో 18 మంది సైనికులు అమరులు అయినట్లు తెలిపింది. అదే సమయంలో 12 మంది బలూచ్ తిరుగుబాటుదారులు సైతం మృత్యువాత పడినట్లుగా వెల్లడించింది. మొత్తంగా 30 మంది ఈ ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు వెల్లడించింది.
కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో ఉగ్రవాదులు రోడ్డును బ్లాక్ చేసేందుకు ప్రయత్నించగా.. పాక్ ఆర్మీ అడ్డుకుందని తెలిపింది. దాంతో..తిరుగుబాటు దారులు కాల్పులకు పాల్పడ్డారని, వారికి భద్రతా సిబ్బంది గట్టి ప్రతిస్పందన ఇచ్చారని పాక్ ఆర్మీ అధికారులు తెలిపారు. జనవరి 31-ఫిబ్రవరి 1 మధ్య కొనసాగిన ఈ ఆపరేషన్లో 18 మంది సైనికుల్ని కోల్పోయినట్లు పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది.
కాగా.. ఈ ప్రాంతంలో చాన్నాళ్లుగా బలూచ్ తిరుగుబాటు దారులు పోరాటం చేస్తున్నారు. తమ ప్రాంతంలోని వనరుల్ని పాక్ సైన్యం, పాలకులు దోచుకుంటున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. ఆ ప్రాంత ప్రజల్ని బానిసలుగా చేసుకుని.. పాక్ సైన్యం హింసిస్తుందని, అక్కడి వనరుల్ని ఇతర దేశాలకు ఎరగా చూపిస్తూ.. నిధులు తెచ్చుకుంటుందని తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే.. వారు సాయుధులై పాక్ సైన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వారి ప్రాంతంలోకి వచ్చే ప్రభుత్వ ట్రక్కులు, సైనిక వాహనాలు సహా ఇతర ప్రభుత్వ విభాగాల అధికారుల్ని కాల్చి చంపేస్తున్నారు. ఇటీవలే.. రహదారిపై వెళుతున్న పాక్ సైనిక కాన్వాయ్ లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేసి, ప్రాణ నష్టం సృష్టించారు.
Also Read : ఉక్రెయిన్ యుద్ధంలో కనిపించని కొరియా సైనికులు.. పుతిన్ కొత్త వ్యూహమా?
తాజా దాడులపై స్పందించిన పాకిస్థాన్.. బలూచ్ తిరుగుబాటుదారులు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించింది. ఉగ్రమూకలు బలూచిస్థాన్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమాయక ప్రజల్ని, ప్రభుత్వ అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అరోపించింది. ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష తప్పదని హెచ్చరించిన పాక్ సైన్యం.. నిందితుల్ని చట్టం ముందుకు తీసుకొస్తామంటూ ప్రకటించింది.