Donald Trump: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. ఇరాన్పై ఈ రోజు రాత్రి మరింత తీవ్రమైన దాడులు చేయబోతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తుర్కియేలో జరుగుతున్న నాటో సదస్సు వేదికగా విలేకర్లతో మాట్లాడిన ఆయన, ఇరాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా, ట్రంప్ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
హర్మూజ్ ఉద్రిక్తతలు.. ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ అనుసరిస్తున్న దూకుడు వైఖరిని ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఇరాన్ దారుణంగా ప్రవర్తిస్తోంది. హర్మూజ్ జలసంధి వద్ద అంతర్జాతీయ నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడుతోంది. దీన్ని మేం చూస్తూ ఊరుకోం. ఇది ఒక చిన్న హెచ్చరిక మాత్రమే.. ఈ రాత్రి ఇరాన్పై మా దళాలు గట్టిగా విరుచుకుపడబోతున్నాయి’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడుల్లో భాగంగా ఇరాన్ ప్రధాన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని, వ్యూహాత్మకంగా కీలకమైన ‘ఖర్గే ద్వీపాన్ని’ కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
Also Read: 15 రోజుల్లో 618 ఫోన్ల ట్యాపింగ్.. సిట్ వలలో ముగ్గురు బీఆర్ఎస్ బడా నేతలు!
ముగిసిన సీజ్ఫైర్.. టెహ్రాన్కు ముప్పు
నిన్ననే ఇరాన్పై కొన్ని దాడులు నిర్వహించామని, తాజాగా సీజ్ఫైర్ (కాల్పుల విరమణ) గడువు కూడా ముగిసిందని ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరోసారి భీకరమైన ఎయిర్ స్ట్రైక్స్ తప్పవంటూ టెహ్రాన్ను హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన రావడం గమనార్హం. అమెరికా సైన్యం ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీసేందుకు సర్వసన్నద్ధమైందనే సంకేతాలను ఈ వ్యాఖ్యలు ఇస్తున్నాయి.
ఖమేనీ అంత్యక్రియల వేళ సంచలనం
మరోవైపు, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఈ కీలక సమయంలో ట్రంప్ చేసిన ప్రకటన ఇరాన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు, ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, అంత్యక్రియల్లో పాల్గొంటున్న లక్షలాది మందిని ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేయొచ్చంటూ ట్రంప్ అంతకుముందే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో, ఈ రాత్రి జరగబోయే దాడులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.
Also Read: భార్య, ప్రియుడు.. ఒక మర్డర్ స్కెచ్! మియాపూర్ సత్యవతి క్రైమ్ స్టోరీ!