US Wildfire : అమెరికాలోని లాస్ ఎంజెల్స్ లో చెలరేగిన కార్చిచ్చు క్రమంగా తీవ్రమవుతుండాా.. అక్కడి అత్యయిక పరిస్థితి ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పటికే.. వేల ఎకరాలకు అలుముకున్న మంటలు రానురాను మరింత బలంగా మారి.. దట్టమైన అటవినీ కాల్చేస్తున్నాయి. ఇప్పటి వరకు అగ్ని కీలల కారణంగా.. లాస్ ఎంజెల్స్, కాలిఫోర్నియా నగరాల్లో ఏకంగా 10 మంది చనిపోగా, 1 లక్షా 30 వేల మందిని బలవంతంగా అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. ఈ అగ్నిప్రమాదంలో.. బాలివుడ్ కి చెందిన ఎంతో మంది నటీనటుల ఇళ్లు దగ్ధమవుతున్నాయి. వాటిలో.. పారిస్ హిల్టన్, ఆడమ్ బ్రోడే, బిల్లే క్రిస్టల్ సహా మిగతా వారి ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇప్పటికే.. హాలివుడ్ స్టూడియోస్ ఉన్న కొండ అగ్నిప్రమాదంలో చిక్కుకోగా.. ఆస్కార్ అవార్డుల ప్రకటనను అగ్నిప్రమాద తీవ్రత దృష్ట్యా రెండు రోజుల పాటు వాయిదా వేశారు.
సాధారణంగానే.. అమెరికాలోని విస్తారమైన అడవుల్లో నిత్యం అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ.. ప్రస్తుతం అక్కడ చలి కాలం నడుస్తుంది. ఓ వైపు అతి శీతల గాలులు అమెరికాను గడగడ వణిస్తున్నాయి. ఈ తరుణంలో.. అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలేంటా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా.. అమెరికా చరిత్రలోనే పూర్తి చలికాలంలో ఇలాంటి అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం.. వింతగా ఉంది అంటున్నారు అక్కడి ప్రజలు. అయితే.. దట్టమైన అడవిలో నుంచి వేసిన పవర్ కేబుళ్లు ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. కానీ.. ఆ విషయాన్ని పూర్తిగా నిర్థరించేందుకు వీలు లేదంటున్నారు. స్పష్టమైన కారణాలు తెలియాలంటే.. ఇంకా సమయం పడుతుందని అంటున్నారు.
గత 2022, 2023లోని శీతాకాలాల్లో లాస్ ఏంజిల్స్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో పూర్తిగా తడి వాతావరణం ఉంది. కానీ.. ఈ శీతాకాలంలో దక్షిణ కాలిఫోర్నియాలో అనూహ్యంగా పొడి వాతావరణం ఏర్పడింది. దాంతో భారీగా వృక్ష సంపద అంతా ఎండిపోయింది. ప్రస్తుతం.. అగ్ని ప్రమాదం వేగంగా వ్యాప్తి చెందుతున్న మార్గం.. ఇలా పొడిగా మారిన మార్గమే.
NASA ప్రకారం అక్టోబర్ నుంచి దక్షిణ కాలిఫోర్నియాలో చాలా తక్కువ వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. దాంతో ఈ ప్రాంతంలో రికార్డు స్థాయిలో శీతాకాలమైనా పొడి వాతావరణం ఏర్పడినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అక్టోబర్ 1 నుంచి 0.03 అంగుళాల (0.08 సెంటీమీటర్లు) వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో.. భూమి తడి వాతావరణాన్ని కోల్పోయిందని, అడవులు సైతం బాగా పొడిగా మారిపోయాయని అంటున్నారు.
లాస్ ఏంజెలెస్ (Los Angeles) లోని ఈశాన్య ప్రాంతంలోని పర్వతాల దగ్గర తొలుత ఈ మంటలు మొదలు కాగా.. క్రమంగా బలమైన గాలులతో మిగతా ప్రాంతాలకు వ్యాప్తిస్తున్నాయని అంటున్నారు. దాంతో పాటూ పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలో మరో అగ్గి రాజుకుంది. ఇది తీరం వెంట ఉన్న సెలబ్రిటీల నివాస ప్రాంతం మొత్తాన్ని కమ్మేసింది. ఇప్పటివరకు రెండువేల ఇళ్ళు అగ్నికి ఆహుతి కాగా.. దాదాపు రూ. 5 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని ఓ అంచనా.
శాంటా అనా గాలులు..
ఈ సీజన్లో కాలిఫోర్నియాలో శాంటా అనా గాలులు సాధారణంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అవి అసాధారణంగా చాలా బలంగా ఉన్నాయంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ కారణంగానే.. పొడి వాతావరణంలో రాజుకున్న కార్చిచ్చు.. బలమైన గాలులు తోడవడంతో మరింత పెద్దవిగా మారిపోయి, వేగంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని అంటున్నారు. అక్టోబర్-జనవరి మధ్య గ్రేట్ బేసిన్ ఎడారులలో అధిక పీడనం ఏర్పడుతుంది. ఈ అధిక పీడనం సవ్యదిశలో తిరుగుతూ.. గాలిని పడమర వైపునకు, తీరం వైపునకు తీసుకొస్తుంది. ఈ గాలులు.. సియెర్రా నెవాడా, శాంటా అనా పర్వతాల మీదుగా వీస్తుందంటున్న శాస్త్రవేత్తలు.. అక్కడే ఇవి తేమను కోల్పోయి, వేడెక్కుతాయని అంటున్నారు. పైగా.. పర్వతాల మధ్య నుంచి ప్రవహించడంతో చాలా వేగంగా వీస్తాయని అంటున్నారు. ఇప్పుడు ఈ గాలుల వల్లే.. దక్షిణ కాలిఫోర్నియా మీదుగా వీచే సమయానికి.. గాలి వేగంగా, పొడిగా, వెచ్చగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే.. ఈ గాలులు అగ్ని కీలల్ని మరింత ఉద్ధృతంగా వీచేలా చేస్తున్నాయని అంటున్నారు.
వాతావరణ మార్పులు..
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇవి మనిషిపై నేరుగా, పరోక్షంగా అనేక ప్రభావాల్ని కలిగిస్తున్నాయి. కాలిఫోర్నియాలో కొన్నేళ్లుగా.. అడవుల్లో మంటలు భారీగా చోటుచేసుకుంటున్నాయి. ప్రతీసారి.. వేల ఎకరాల్లోని వృక్ష సంపద అగ్నికి ఆహుతి అవుతోంది. నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ -2021 ప్రకారం.. గత రెండు దశాబ్దాల్లో సగటు అగ్ని ప్రమాదాల నిష్పత్తి పెరిగింది అంటున్నారు. వీటన్నింటికీ.. కారణం అంతర్జాతీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలే అంటున్నారు.
ముంచేస్తున్న మంచు తుఫాను..
ఓవైపు అగ్ని కీలలు.. అమెరికాలోని సగం ప్రాంతాన్ని చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటే.. మరోవైపు భారీగా కురుస్తున్న మంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో -18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. అమెరికా అధికారుల లెక్కల ప్రకారం.. అమెరికాలోని సుమారు 30 రాష్ట్రాలు మంచు తుఫానులో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.
ఆయా ప్రాంతాల్లోని ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా… 6 కోట్ల మంది అమెరికన్లపై తీవ్ర ప్రభావం పడిందని అంటున్నారు. ప్రస్తుతానికి..యూఎస్ లోని ఏడు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు అక్కడి అధికారులు.
Also Read : జపాన్ ‘పని’ మరణాల హిస్టరీ మీకు తెలుసా? ‘కరోషి’ కల్చర్కు నేటితరం గుడ్బై!
ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న చల్లటి గాలి.. సెంట్రల్ అమెరికాను తీవ్రంగా వణికిస్తోంది. ఈ రాష్ట్రాల్లో అత్యల్పంగా 0 నుంచి –15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమెరికా వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. ఈ మొత్తంలో.. అమెరికాలోని చాలా ప్రాంతాలు స్ధంభించిపోగా.. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు మూతపడ్డాయి. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు చెబుతున్నారు.