Gold Mine Collapsed: చీకటి ఖండం ఆఫ్రికాలోని మాలి దేశంలో ఘోరం జరిగింది. తూర్పు మాలి ప్రాంతంలో ఓ బంగారం గని కుప్పకూలింది. ఈ ఘటనలో 42 మంది కార్మికులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ప్రమాదానికి ముందు గనిలో కార్మికులు పని చేస్తున్నారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మట్టితో బాటు భారీగా బండరాళ్లు పడిపోవడంతో కార్మికులు ఊపిరాడక మృతి చెందారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ మరికొందరు శవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నది అధికారుల మాట. కేవలం నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడం కలకలం రేపుతోంది. బంగారు గని తవ్వకం చట్టబద్ధంగా నిర్వహిస్తున్నారా? అక్రమంగా చేస్తున్నారా? అనేదానిపై ప్రభుత్వం విచార మొదలుపెట్టేసింది. ఘటన జరిగిన బంగారు గని కొంతకాలంగా చైనా కంపెనీ నిర్వహణలో ఉంది.
ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి?
మాలి దేశంలో ఇటీవల జరిగిన రెండో పెద్ద గని ప్రమాదం ఇదే. కొద్ది రోజుల కిందట అంటే జనవరి 29న కౌలికోరో ప్రాంతంలో మరో బంగారు గని కూలిపోయింది. ఈ ఘటనలో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నిరంతరం ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా, ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా లేనట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్, భద్రతా ప్రమాణాలు లేకుండా నడవడం వల్లే ఇలాంటి ఘోర మైన ప్రమాదాలకు కారణమవుతున్నాయని అంటున్నారు.
మాలి సంగతి ఏంటి? 10 శాతం గనుల్లో ఉపాధి
ఆఫ్రికాలో మాలి దేశం పేరు చెప్పగానే ముందుగా బంగారం గనులు గుర్తుకు వస్తాయి. బంగారం ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశం. ఇక్కడి ఆర్థిక వ్యవస్థలకు బంగారం గనులకు కీలక స్థానం ఉంది. అందుకే ఆ దేశ జనాభాలో 10 శాతం మంది ప్రత్యక్షంగా గనుల్లో ఉపాధి పొందుతున్నారు. కానీ సరైన భద్రతా నిబంధనలు పాటించరు. అనధికారిక గనులు అధికంగా ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. గనులకు సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు సాగుతున్నాయని స్థానిక పత్రికలు చెబుతున్నాయి.
ALSO READ: గాడిదకు రంగులు వేసి జీబ్రా అని ప్రచారం.. తీరా సీన్ కట్ చేస్తే..?
భద్రత ఎక్కడ?
రెండేళ్ల కిందట అంటే 2023లో ఇలాంటి ఘోర ప్రమాదం మాలిలో చోటు చేసుకుంది. అప్పట్లో జరిగిన గని ప్రమాదంలో 70 మంది మరణించారు. పదుల సంఖ్యలో క్షత్రగాత్రులయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వం గనుల భద్రతను గాలికి వదిలేసిందనే విమర్శలు లేకపోలేదు. ఈ విషయంలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు లేకపోలేదు. కార్మికులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు, నిబంధనలను గాలి కొదిలేసిందనే వార్తలు లేకపోలేదు.
తరచు జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నది ప్రజల డిమాండ్. గనుల భద్రతా ప్రమాణాలను కఠిన తరం చేయడం, అక్రమంగా నడుస్తున్న గనులపై ఉక్కుపాద మోపాల్సిన అవసరం ఉంది. గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పునరావృతమవుతున్న ఇలాంటి ఘటనలపై మాలి ప్రభుత్వం పునఃసమీక్షించుకునేలా చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో మాలి ప్రజలు ఆలోచనలో పడ్డారు. గనిలో పనులకు ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో పడుతున్నారు.