Heavy Rains Emergency Alert in Pakistan : రెండేళ్ల క్రితం తీవ్రమైన వేడిగాలులతో అల్లాడిపోయిన పాకిస్థాన్.. ఇప్పుడు అదే సమయంలో భారీ వర్షాలతో కుదేలవుతోంది. 2022లో కురిసిన వర్షాల ధాటికి అక్కడి నదులు పొంగి పొర్లాయి. ఏరులు కట్టులు తెంచుకుని ఊళ్లపై పడటంతో 1739 మంది మృతి చెందారు. ఇప్పుడు మూడురోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా 41 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 28 మంది పిడుగుల కారణంగా చనిపోయినట్లు తెలిపారు. మృతుల్లో అధికశాతం రైతులే ఉన్నట్లు చెప్పారు.
రానున్నరోజుల్లో వర్షాలు మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాక్ ప్రభుత్వం సూచించింది. ముర్రే, గలియత్ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, కొండచరియలు సైతం విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also Read : ఆప్ఘాన్ ను ముంచెత్తిన వరదలు.. 33 మంది మృతి
పంఖ్తుంఖ్వా ప్రావిన్సులో భారీవర్షాలకు ఇళ్లు కూలిపోవడంతో 8 మంది మరణించినట్లు ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మృతుల్లో ముగ్గురు పురుషులు, నలుగురు పిల్లలు ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయని చెప్పారు. అలాగే నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్సులో నలుగురు మరణించినట్లు ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. సెంట్రల్ పంజాబ్ ప్రావిన్స్లో పిడుగుపాటుకు ఏడుగురు చిన్నారులు సహా కనీసం 21 మంది మరణించగా.. మరో ఐదుగురు గాయపడినట్లు తెలిపారు.
మరోవైపు ఆప్ఘనిస్తాన్ ను సైతం భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 33 మంది మరణించగా.. మరో 27 మంది గాయపడినట్లు తాలిబన్ ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. టాంజానియాలోనూ భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గడిచిన రెండు వారాల్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా 58 మంది మరణించినట్లు తెలిపారు.