Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న అడియాలా జైలు వెలుపల మంగళవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తమ సోదరుడిని కలిసేందుకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ సోదరీమణుల పట్ల పాక్ పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. వారిని నేలపైకి నెట్టివేసి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్న ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
గత రెండేళ్లుగా తోషాఖానా (రాజకీయ బహుమతుల విక్రయం) కేసులో.. ఇతర అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన్ను కలిసేందుకు షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆయన సోదరీమణులు అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా, నోరీన్ ఖాన్ జైలు వద్దకు చేరుకున్నారు. అయితే, జైలు అధికారులు వారికి అనుమతి నిరాకరించారు. దీంతో వారు జైలు బయటే దాదాపు 10 గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సమయంలోనే పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు.
జుట్టు పట్టుకుని రోడ్డుపై..
పోలీసుల చర్యపై ఇమ్రాన్ సోదరి నోరీన్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విడుదలైన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఒక మహిళా పోలీస్ అధికారి నా జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. నా కాళ్ళు పట్టుకుని లాగారు. పంజాబ్ పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తించారు. వారు ఇంత దిగజారుతారని ఊహించలేదు’ అని కన్నీటిపర్యంతమయ్యారు. మరో సోదరి అలీమా ఖాన్ మాట్లాడుతూ.. నోరీన్ను లాక్కెళ్తున్నప్పుడు ఆమె స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చారని, పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు చేశారు.
చీకట్లో దాడి.. ఆర్మీ చీఫ్పై ఆరోపణలు
ఈ ఘటనపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసన జరుగుతున్న ప్రాంతంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా లైట్లు ఆపివేశారని.. ఆ ప్రాంతాన్ని నీటితో నింపేసి భయానక వాతావరణం సృష్టించారని పార్టీ పేర్కొంది. ఆ చీకటిలోనే మహిళలపై పోలీసులు భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హస్తం ఉందని అలీమా ఖాన్ ఆరోపించారు. గత సెప్టెంబరులో ఇమ్రాన్ ఖాన్ కూడా తన కుటుంబంపై అసిమ్ మునీర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని.. దేశంలో ప్రస్తుతం అసిమ్ చట్టం నడుస్తోందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన
ఇమ్రాన్ ఖాన్ను ఏకాంత కారాగారంలో ఉంచారని.. ఆయనకు కనీస మానవ హక్కులు కూడా కల్పించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోదరుడిని పరామర్శించేందుకు వెళ్లిన సోదరీమణులపై జరిగిన దాడి పాక్ రాజకీయాల్లో మరింత వేడిని రాజేసింది.
ALSO READ: Weather News: చలి చంపేస్తున్న వేళ.. రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు.. జర్రంతా జాగ్రత్త..!