Weather News: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చలి చంపేస్తోంది. చలి తీవ్రత భారీగా పెరిగింది. అయితే.. గజగజ వణికిస్తున్న చలి తీవ్రత ఎట్టకేలకు నేటితో ముగియనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎముకలు కొరికివేసే చలితో ప్రజలు ఇన్నాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ చలి పంజా రేపటి నుంచి అంత ప్రభావం ఉండకపోవచ్చు. ఈ రాత్రికి మాత్రం ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయి. చలి గాలుల ప్రభావం ఈ ఒక్క రోజు మాత్రమే బలంగా ఉంటుంది. రేపటి నుంచి మాత్రం ఈ పరిస్థితిలో మార్పు రానుంది. ఇన్నాళ్లుగా వీచిన చలి గాలులకు ఇక బ్రేక్ పడనుంది.
బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావం రాష్ట్రంపై పడనుంది. ఈ గాలుల్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. రేపటి రాత్రి నుంచి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి చేరుకుంటాయి. ఇన్నాళ్లు పొడి వాతావరణం ఉండటం వల్లే చలి ఎక్కువగా అనిపించింది. ఇకపై తేమ గాలులు వీస్తుండటంతో చలి నుంచి ప్రజలకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. వాతావరణం కాస్త వెచ్చగా మారుతుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చారు.
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వాతావరణంలో చిన్నపాటి మార్పులు చోటుచేసుకోనున్నాయి. నవంబర్ 23, 24 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఇవి విస్తారంగా కురిసే వర్షాలు కాదు కాబట్టి వీటి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. రైతులు తమ పనులను యధావిధిగా చేసుకోవచ్చు. ఈ జల్లులను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కేవలం ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల వచ్చే చిన్నపాటి జల్లులు మాత్రమే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నవంబర్ 27, 28 తేదీల తర్వాత వాతావరణంలో భారీ మార్పులు రానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. పంటల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ వర్షాలు అల్పపీడనం కారణంగా కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియజేయనున్నారు. చలి పోయి వర్షాలు వచ్చే ఈ మార్పును ప్రజలు గమనించాలి. రాబోయే వర్షాలకు అనుగుణంగా సిద్ధంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.