Imran Khan Jail: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. గత గత కొంత కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ను రావల్పిండిలోని ఆడియాలా జైలులో బంధించి 1100 రోజులు అయిన సందర్భంగా ఆయన కుమారుడు ఖాసీం ఖాన్ ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన తండ్రిని ఎంతగానో మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తన తండ్రి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడైన ఖాసీం ఖాన్ (26) తన అన్న సులేమాన్ ఖాన్ తో కలిసి ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నాడు. తాజాగా తన ఎక్స్ పోస్టులో ‘మా నాన్న ఇమ్రాన్ ఖాన్ ను జైలులో పెట్టి ఇప్పటికి 1100 రోజులు అయ్యింది. మార్చి నుంచి ఆయన గొంతును నేను, నా సోదరుడు విన్నది లేదు. నెలల తరబడి మమ్మల్ని ఆయనతో మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు. నా తండ్రి కంటిచూపు క్రమంగా క్షీణిస్తోంది. వైద్య సేవలు అందిస్తున్నారో లేదో కూడా అర్థం కావడం లేదు. నా తండ్రి యోగ క్షేమాల గురించి ఎలాంటి సమాచారం గానీ, భరోసా కానీ మాకు ఇంతవరకూ లభించలేదు’ అని ఖాసీం ఖాన్ రాసుకొచ్చారు.
It has now been around 1,100 days since my father, Imran Khan, was imprisoned, and my brother and I haven’t heard his voice since March. For months, we’ve been denied contact with him. We remain in the dark about his access to healthcare as his eyesight continues to deteriorate.… pic.twitter.com/6yg3lmYCs5
— Kasim Khan (@Kasim_Khan_1999) July 23, 2026
ఈ మధ్య కాలంలో తన తండ్రిని బాగా మిస్ అవుతున్నట్లు ఎక్స్ పోస్టులో ఖాసీం ఖాన్ వాపోయారు. క్రికెట్, తాను చూసిన సినిమాలు, చదివిన పుస్తకాల గురించి తన తండ్రితో పంచుకోవాలని ఎంతో ఆశగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు పాక్ పౌరులు తమ నాయకుడైన ఇమ్రాన్ ఖాన్ కు స్వేచ్ఛ కల్పించాలని బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇది కేవలం తన తండ్రికి సంబంధించిన అంశం కాదని.. యావత్ పాకిస్థాన్ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఎక్స్ లో చెప్పారు.
తన తండ్రిని అన్యాయంగా జైల్లో బంధించడంపై అంతర్జాతీయ సమాజం చూసి చూడనట్లు ఉండొద్దని ఖాసీం ఖాన్ కోరారు. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం దాన్ని ప్రోత్సహించడమే అవుతుందని పేర్కొన్నారు. కస్టడీలో ఉన్నప్పుడు రక్తం గడ్డకట్టడంతో తన తండ్రి ఇమ్రాన్ కుడి కంటి చూపును దాదాపుగా కోల్పోయారని ఖాసీం అన్నారు. ప్రస్తుతం 15 శాతం దృష్టి మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. దీనిపై పాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిందని చెప్పారు.
Also Read: BSNL రూ. 2,799 vs Vi రూ. 2,249.. ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే వార్షిక ప్లాన్ ఏది?
ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ కు అవసరమైన వైద్య సేవలు జైల్లో అందిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కాగా, తోషా ఖానా (జాతీయ ఖజానా) కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను 2023 ఆగస్టు 5న అరెస్టు చేశారు. అప్పటి నుంచి 1100 రోజులుగా ఆయన రావల్పిండిలోని అడియాలా జైలులోనే శిక్ష అనుభవిస్తూ వస్తున్నారు.
Also Read: ఏంటీ.. రూ.350 లోపే అపరిమిత 5G డేటానా? ఈ Airtel ప్లాన్స్తో రచ్చ రచ్చే!