బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల రేట్లు భారత్ లో భారీగా తగ్గబోతున్నాయి. బ్రిటన్ బ్రాండ్ స్కాచ్, విస్కీ, జిన్ ల ధరలు సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. తాజాగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA) ద్వారా ఇది సాధ్యమైంది. ఈ చారిత్రక ఒప్పందంపై భారత్ ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల కేవలం దిగుమతులు అందుబాటులోకి రావడంతోపాటు భారత్ కి మరిన్ని లాభాలు చేకూరుతాయని అంటున్నారు. బ్రిటన్ కార్లు మరింత చౌకగా భారత్ మార్కెట్ లో లభిస్తాయి. వీటిపై విధిస్తున్న దిగుమతి సుంకాలు భారీగా తగ్గబోతున్నాయి.
ఎగుమతులకు అనుకూలం..
భారత్, బ్రిటన్ మధ్య వాణిజ్య సంబంధాలు సజావుగానే ఉన్నా సుంకాల భారం అధికంగా ఉండటం విశేషం. అయితే ఇప్పుడు రెండు దేశాలు పరస్పర సహకారంతో ఈ బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేశాయి. తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ఉత్పత్తులకు లాభదాయకం అవుతోంది. ముఖ్యంగా బ్రిటన్కు ఎగుమతయ్యే భారత ఉత్పత్తులపై సుంకాల భారం భారీగా తగ్గుతోంది. దాదాపు 99 శాతం వస్తువులపై ఈ తగ్గింపు ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. వస్త్రాలు, వ్యవసాయరంగ ఉత్పత్తులు, ఆహారశుద్ధి ఉత్పత్తులపై సుంకాలను బ్రిటన్ పూర్తిగా మినహాయించడం ఇక్కడ విశేషం. దీంతో భారత్ నుంచి బ్రిటన్ కు ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య పరిమాణాన్ని రెట్టింపు చేసుకోవాలని దేశాధినేతలు తీర్మానించారు.
విజన్ 2035
ఇండియా-బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు విజన్ 2035ని కూడా ఆవిష్కరించారు. రాబోయే పదేళ్లలో రక్షణ, సాంకేతిక, శుద్ధ ఇంధనం, మైగ్రేషన్ రంగాల్లో మరింత ముందడుగు వేయాలని తీర్మానించారు. ఇటీవల కాలంలో బ్రిటన్, విదేశాలతో కుదుర్చుకున్న భారీ డీల్ ఇది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకొచ్చిన తర్వాత బ్రిటన్, ఇండియాతో తొలిసారిగా ఈ భారీ డీల్ కుదుర్చుకోవడం విశేషం.
అమెరికా వాణిజ్య యుద్ధం వల్ల ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. చిన్నా పెద్దా అన్ని దేశాలు ట్రంప్ సుంకాల వల్ల విలవిల్లాడుతున్నాయి. ఈ దశలో అమెరికాను కాదని ఇతర దేశాలన్నీ పరస్పర సహకారంతో వాణిజ్య రంగంలో బలోపేతం కావడానికి కృషి చేస్తున్నాయి. ఈ దిశగా ఇండియా-బ్రిటన్ తొలి అడుగు వేశాయని చెప్పాలి. ఇకపై భారత్ వస్తువులు బ్రిటన్ కి పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే అవకాశాలున్నాయి. అదే సమయంలో అధిక సుంకాల ధాటికి అంతంతమాత్రంగానే ఉన్న దిగుమతులు కూడా పెరుగుతాయి.
ఆ పని చేస్తారా..?
భారత్ కు చెందిన పలువురు ఆర్థిక నేరగాళ్లకు బ్రిటన్ ఆశ్రయం ఇచ్చిన సంగతి తెలిసిందే. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయమ మాల్యా.. వీరంతా బ్రిటన్ లోనే తలదాచుకుంటున్నారు. భారత్ లో బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వీరంతా దర్జాగా బ్రిటన్ లో రాజభోగం అనుభవించడం, మన ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ దశలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్ లో తలదాచుకున్న వారికి శిక్షపడేలా చేయడంలో సహకరించాలని బ్రిటన్ ప్రధానిని కోరారు మోదీ.