India vs Celebi: ఉగ్రవాదాన్ని మద్దతు ఇస్తున్న టర్కీకి భారత్లో నిరసనలు ఎదురవుతున్నాయా? తొలుత యాపిల్ పండ్లు, ఆ తర్వాత యూనివర్సిటీతో డీల్ క్యాన్సిల్.. ఇప్పుడు సెలెబి కంపెనీ వంతైంది. ప్రస్తుతం టర్కీ దేశం భారత్ నుంచి ఊహించని సవాళ్లు ఎదుర్కొంటోందా? ఇదే జరిగితే ఆ దేశానికి ఇబ్బందులు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది.
ఆపరేషన్ సింధూర్లో పాకిస్థాన్కు అండగా నిలిచింది టర్కీ. భారత్తో యుద్దానికి దిగిన పాకిస్థాన్కు డ్రోన్లు, మిస్సైళ్లు అందజేసింది. ఈ విషయం వార్ విషయంలో బయటకు రావడంతో టర్కీపై భారతీయులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆ దేశానికి సంబంధించిన వాటిపై నిషేధం విధించాలని దేశీయంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. పరిస్థితి గమనించిన మోదీ సర్కార్ చర్యలు తీవ్రతరం చేసింది.
ఈ నేపథ్యంలో ఇండియాలోని ఎయిర్పోర్టుల్లో సేవలు అందిస్తున్న టర్కీ కంపెనీ సెలెబీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది భారత ప్రభుత్వం. హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, ముంబైతోపాటు మరో ఐదు ఎయిర్ పోర్టుల్లో సేవలను అందిస్తోంది. విమానాల పార్కింగ్, క్లీనింగ్, లగేజీ లోడింగ్, అన్ లోడింగ్, విమానాల లోపల క్లీనింగ్ వంటి సేవలు అందించనుంది. దీనికి సెలిబీ ఎయిర్పోర్టు సర్వీసెస్ ఇండియా అని పేరు పెట్టారు.
అయితే భద్రతా పరమైన కారణాలతో సెలెబీకి అనుమతులు రద్దు చేస్తున్నట్లు పౌరవిమానయాన భద్రత మండలి ప్రకటించింది. ఈ కంపెనీకి టర్కీ ప్రధాని ఎర్డోగాన్ కుమార్తె సుమెయ్యి నిర్వహిస్తున్నారని వార్తలు వచ్చాయి. విమానాల సర్వీసు కింద కోట్లలో ఆదాయం వస్తుంది.
ALSO READ: పాకిస్థాన్ తో ట్రంప్ రహస్య ఒప్పందం.. ఆపరేషన్ సింధూర్కు ముందే ఖరారు
ఈ విషయంలో ఇండియా నుంచి అధిక మొత్తం ఆ కంపెనీకి వెళ్తుంది. టర్కీ ప్రధాని అల్లుడు పాకిస్తాన్కు యుద్దానికి సంబంధించి డ్రోన్లను సరఫరా చేసే కంపెనీకి అధిపతిగా ఉంటున్నాడు. ఈ విషయం తెలియగానే భారతీయుడు ఓ రేంజ్లో మండిపడ్డారు.
సెలెబి కంపెనీ అనుమతులను రద్దు చేయగానే ఆ కంపెనీ ప్రతినిధులు నోరు విప్పారు. ఈ కంపెనీ టర్కీకి చెందింది కాదని తెలిపింది. ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఫ్యామిలీతో ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకుంది. ఆయన కూతురు తమ బాస్ కాదని తెలియజేసింది. సుమెయ్యి పేరు మీద కంపెనీలో హక్కులు, వాటాలు గానీ లేవన్నారు. ఎలాంటి రాజకీయాలకు సంబంధించినది కాదని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా తాము ఏవియేషన్ విభాగంలో సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. ఏ విదేశీ ప్రభుత్వంతోగానీ, వ్యక్తులతో గానీ ఎలాంటి సంబంధాలు లేవని ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ సంస్థలో 65 శాతం వాటాలు కెనడా, యూఎస్, యూకే, సింగపూర్, యూఏఈ, పశ్చిమ ఐరోపా దేశాలకు చెందినవారు ఉన్నారన్నది ఆ కంపెనీ మాట. సెలెబీతో ఒప్పందం రద్దు నేపథ్యంలో ఆయా విమానాశ్రయాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ వెల్లడించారు.
మరోవైపు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ-JNU టర్కీలోని యూనివర్సిటీ లతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఒప్పందాన్ని రద్దు చేసినట్టు ప్రకటించింది. ఈ ఒప్పందం మూడేళ్లపాటు కుదిరింది. 2025 ఫిబ్రవరి నుంచి 3 నుంచి 2028 ఫిబ్రవరి 2 వరకు అమల్లో వుంది. అలాగే జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కూడా టర్కీకి చెందిన ఏ విద్యా సంస్థలతో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అందుకుముందు టర్కీ యాపిల్స్ను మహారాష్ట్రలో వినియోగదారులు బాయ్ కట్ చేసిన విషయం తెల్సిందే.