Indian Helper Died In Russia Ukraine War: రష్యా -ఉక్రెయిన్ మధ్య జరుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన ఓ భారతీయుడు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. ఫిబ్రవరి 21న ఆక్రమిత దొనెట్స్క్ ప్రాంతంపై కీవ్ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోగా.. మరో భారతీయుడు ఈ దాడి నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన భారతీయుడిని సూరత్కు చెందిన హేమిల్ అశ్విన్భాయ్ మంగుకియాగా గుర్తించారు. అతడు డిసెంబర్ 2023లో రష్యాకు వెళ్లగా.. అక్కడి సైన్యంతో అటాచ్ చేశారు.
హేమిల్ను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని కోరుతూ అతడి తండ్రి తరఫున ఏజెంట్ ఇటీవలే విదేశాంగశాఖకు లేఖ రాశాడు. మరోవైపు ఇప్పటికే అక్కడ చిక్కుకుపోయిన పలువురు భారతీయులు రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. హేమిల్ మృతిపై విదేశాంగశాఖ స్పందిస్తూ తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొంది.
Read More : న్యూయార్క్ లో అగ్నిప్రమాదం.. భారత జర్నలిస్టు మృతి
మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల సమీర్ అహ్మద్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. దాడి జరిగిన రోజు ఓ డ్రోన్ ఎగరడాన్ని అతడు గమనించినట్లు తెలిపాడు. తనకు 150 మీటర్ల దూరంలో హేమిల్ తుపాకీ కాల్చడాన్ని సాధన చేస్తున్నట్లు తెలిపాడు. అంతలోనే భారీ చప్పుడు వచ్చిందన్నాడు.
ఆ సమయంలో తనతో పాటు ఇద్దరు భారతీయులు, రష్యా సైనికులు దాక్కొన్నట్లు పేర్కొన్నాడు. కొంత సమయం తర్వాత అక్కడికి వెళ్లి చూడగా.. హేమిల్ చనిపోయినట్లు తెలిసిందన్నాడు. సమీర్ హేమిల్ మృతదేహన్ని మరికొందరి సాయంతో ఓ ట్రక్కులోకి ఎక్కించినట్లు తెలిపాడు.
ఆ దాడిలో కొందరు నేపాలీలు కూడా చనిపోయినట్లు వెల్లడించాడు. హేమిల్ మృతదేహాన్ని దాదాపు రెండు నెలల తర్వాత భారత్కు అప్పగించే అవకాశం ఉందని రష్యా కమాండర్ చెప్పినట్లు తెలిపాడు. రష్యా నుంచి తమను ఎలాగైనా విదేశాంగశాఖ సురక్షితంగా బయటకు తేవాలని సమీర్ కోరాడు.
వాస్తవానికి తూర్పు ఉక్రెయిన్లోని రష్యా సైనికుల శిక్షణ శిబిరంపై జరిగిన దాడిలో కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాల ద్వారా తెలుస్తోంది.