ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత చర్యల్ని మీడియా ఆకాశానికెత్తేసింది. పాక్ కి తగిన శాస్తి జరిగిందంటూ వార్తల్ని ప్రచురించింది. భారత్ లోని మీడియా భారత చర్యల్ని సమర్థించడం పెద్ద విశేషమేమీ కాదు, మరి ఈ దాడిని అంతర్జాతీయ మీడియా ఎలా చూస్తోంది, ఆయా దేశాల అంతరంగం ఏంటి అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.
వాస్తవానికి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటే ప్రపంచ దేశాలు రెండు వర్గాలుగా విడిపోతాయి. మరికొన్ని తటస్థ వైఖరిని ప్రదర్శిస్తాయి. రెచ్చగొట్టే చర్యలు వద్దని హితవుపలుకుతాయి. దాడులు, ప్రతిదాడుల వల్ల శాంతి సామరస్యం దెబ్బతింటాయని చెబుతాయి. కానీ పాక్ పై భారత్ దాడిని ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కటీ ఖండించకపోవడం విశేషం. ఆయా దేశాల విదేశాంగ విధానాలను ప్రతిబింబిస్తూ వారి వారి జాతీయ మీడియాలు భారత్ కి మద్దతుగా వార్తలివ్వడమే దీనికి నిదర్శనం. పాక్ పై భారత్ చేసింది ముమ్మాటికీ న్యాయమేనని, అది ఉగ్రవాద వ్యతిరేక చర్య అని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఒక్క పాక్ మీడియా మాత్రమే ఏడుస్తూ వార్తలిచ్చి ప్రపంచ దేశాల సానుభూతికోసం ప్రయత్నించింది.
అమెరికా కేంద్రంగా వెలువడే న్యూయార్క్ టైమ్స్.. భారత్ చర్యల్ని పరోక్షంగా సమర్థించింది. కాశ్మీర్ లో జరిగిన దాడి తర్వాతే భారత్ క్షిపణి దాడుల్ని మొదలు పెట్టినట్టు పేర్కొంది. పాక్-భారత్ వివాదాన్ని ఇది మరింత పెద్దది చేసిందని అంటూనే.. ఈ దాడి గురించి భారత్, అమెరికాకు తెలియజేసినట్టు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వార్తల్ని అందించే న్యూస్ ఏజెన్సీ CNN కూడా భారత్ వైఖరిని స్పష్టం చేసింది. భారత సైనిక సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ వార్తలిచ్చింది. భారత్ చేసిన దాడి పాక్ సైన్యంపై కాదని, కేవలం ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే ప్రాంతాలపైనేనని స్పష్టం చేసింది CNN.
ఇక ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత్ ఎంతో సంయమనంతో వ్యవహరించిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఆ పత్రిక కథనం ప్రకారం భారత్ ఎక్కడా దుందుడుకు చర్యలు తీసుకోలేదు. పౌరులపై, పాక్ సైన్యంపై ఎక్కడాదాడి చేయలేదని, కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే మట్టుబెట్టిందని, భారత సైనిక శక్తిని చాటి చెప్పిందని పేర్కొంది.
ఉగ్రవాద కేంద్రాలనే భారత్ లక్ష్యంగా చేసుకున్నట్టు బీబీసీ తెలిపింది. అయితే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతాయేమోనని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్నట్టు స్పష్టం చేసింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా భారత్ దాడి లక్ష్యాన్ని స్పష్టంగా పేర్కొంది. పాకిస్తాన్లోని అనుమానిత మిలిటెంట్ స్థావరాలనే భారత్ లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. దాడి లక్ష్యాలను పేర్కొనలేదు కానీ.. కాశ్మీర్ లో ఉగ్రమూకల దాడి తర్వాత భారత్ క్షిపణి వ్యవస్థతో ప్రతీకార చర్యలకు దిగిందని చికాగో ట్రిబ్యూన్ వార్తలిచ్చింది. కాశ్మీర్ ఉద్రిక్తతలకు బదులుగా భారత దేశం సైనిక దాడులు ప్రారంభించిందని ది గార్డియన్ తెలిపింది. భారత క్షిపణి దాడులతో రెండు దేశాల మధ్య సంక్షోభం మరింత ముదిరినట్టు బ్రిటన్ కి చెందిన వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. పర్యాటకుల ఊచకోత తర్వాత భారతదేశం, పాకిస్తాన్పై బాంబు దాడి చేసిందని ది టైమ్స్ ప్రచురించింది. జపాన్ టైమ్స్ కూడా భారత్ కి మద్దతుగా వార్తలిచ్చింది. కాశ్మీర్ లో పర్యాటకుల హత్యకు భారత్ ప్రతీకార దాడి చేసిందని పేర్కొంది. జపాన్ టుడే కూడా ఇలాంటి కథనాలనిచ్చింది. ఇజ్రాయెల్ కి చెందిన ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తా సంస్థ.. పాకిస్తాన్పై దాడుల తర్వాత ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం తన ఆత్మరక్షణ హక్కును చాటి చెప్పినట్టు పేర్కొంది.
మొత్తమ్మీద అంతర్జాతీయ మీడియా భారత్ చర్యను సమర్థించింది. ఆపరేషన్ సిందూర్ ని ప్రతీకార దాడిగా మాత్రమే పేర్కొంది. అదే సమయంలో పాక్ సైనికులపై, పౌరులపై ఎలాంటి దాడి జరగలేదని, కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే భారత్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది.