Japan News: భార్యభర్తల బంధంలో చిన్నచిన్న అలకలు, కోపతాపాలు సహజం. కొద్దిరోజులు మాట్లాడుకోకపోవడం మనం చాలా కుటుంబాల్లో చూస్తుంటాం. కానీ, ఏకంగా 20 ఏళ్ల పాటు భార్యతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒకే ఇంట్లో ఉండిపోయిన విచిత్రమైన సంఘటన గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి కాస్త నమ్మశక్యంగా లేకపోయినా ఇది అక్షరాలా నిజం. జపాన్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై ఉన్న వింతైన అసూయతో రెండు దశాబ్దాల పాటు పూర్తి మౌనాన్ని పాటించి, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఈ వింత ఘటనకు సంబంధించిన కథనం సోషల్ మీడియాలో మరోసారి విపరీతంగా వైరల్ అవుతోంది.
అసలు మౌనానికి గల కారణం ఏంటి?
జపాన్లోని ‘నారా’ నగరానికి చెందిన ఓకువో కటయామా, ఆయన భార్య యూమి ఒకే ఇంట్లో నివసిస్తూ ముగ్గురు పిల్లలను ఎంతో బాధ్యతగా పెంచారు. అయితే, పిల్లలు పుట్టిన తర్వాత భార్య యూమి వారిపైనే ఎక్కువ ప్రేమ, శ్రద్ధ చూపిస్తోందని ఓకువో భావించాడు. తనను భార్య నిర్లక్ష్యం చేస్తోందనే ఒకరకమైన పిల్లల పై అసూయ ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది. దాంతో ఆమెపై అలకబూని, ఏకంగా మాటలు బంద్ చేశాడు. భార్య యూమి ఎన్నిసార్లు మాట్లాడటానికి ప్రయత్నించినా, ఆయన కేవలం ఊకొట్టడం లేదా తల ఊపడం తప్ప నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. భార్యతో మౌనంగా ఉన్నప్పటికీ, తన పిల్లలతో మాత్రం ఆయన ఎప్పటిలాగే సాధారణంగా మాట్లాడేవాడు.
తెరపైకి తెచ్చిన కుమారుడు.. నెరవేరిన కల
తల్లిదండ్రులు ఒకే ఇంట్లో ఉంటూ కూడా దశాబ్దాలుగా మాట్లాడుకోకపోవడం చూసి పెరిగిన వారి చిన్న కుమారుడు యోషికి (18) ఎలాగైనా వారి మధ్య ఉన్న ఈ సుదీర్ఘ మౌనానికి స్వస్తి పలకాలని భావించాడు. ఇందుకోసం ఆయన జపాన్లోని ఒక ప్రముఖ రియాలిటీ టీవీ షో సహాయం కోరాడు. ఆ టీవీ షో నిర్వాహకులు ఈ వింత సమస్యన పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. ఆ దంపతులు దశాబ్దాల కిందట మొదటిసారి ఎక్కడైతే కలుసుకుని ప్రేమించుకున్నారో, అదే పార్కులో వారికి తెలియకుండా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలు కొద్ది దూరంలో నిలబడి గమనిస్తుండగా, ఆ టీవీ ప్రోగ్రామ్ ద్వారా వారిద్దరినీ ఒకరికొకరు ఎదురుపడేలా చేశారు.
భావోద్వేగాల సమాహారం.. దశాబ్దాల మౌనానికి తెర!
పార్కులో భార్యతో ఒంటరిగా కూర్చున్న ఓకువో, చివరకు తన మొండితనాన్ని వీడి 20 ఏళ్ల తర్వాత మొదటిసారి నోరు విప్పాడు. “మనం మాట్లాడుకుని చాలా కాలమైంది. ఇన్నాళ్లూ నువ్వు పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్నావు. ఎంతో ఓపికగా నన్ను భరించావు, నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని గొంతు రుద్ధమై భార్యతో చెప్పాడు. అలాగే “పిల్లలపై నువ్వు చూపే శ్రద్ధను చూసి అసూయ పడ్డాను, అందుకే అలా మొండిగా వ్యవహరించాను. పోగొట్టుకున్న కాలాన్ని తిరిగి తేలేం, కానీ ఇకపై మళ్లీ సాధారణంగా ఉందాం” అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ భావోద్వేగ దృశ్యాన్ని చూసి ఆ క్షణంలో అక్కడ ఉన్న పిల్లలు, ప్రేక్షకులు సైతం కంటతడి పెట్టారు. వాస్తవానికి ఈ వింత సంఘటన 2017లో వెలుగులోకి వచ్చినప్పటికీ, మానవ సంబంధాలు, ఈగోల చుట్టూ తిరిగే ఈ కథనం ఇప్పటికీ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Also Read: యువతకు కృతజ్ఞతలు.. ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్
Otou Katayama, kıskançlıktan kavga ettiği karısıyla 20 yıl tek kelime konuşmamış; oğlu bi TV şovundan yardım istemiş veee…
hoşgeldin 2017 pic.twitter.com/FJA2T7VrDu— Kadir Kaymakcı (@Kadirkaymakci) December 31, 2016