Earthquake In Myanmar And Thailand: భారీ భూకంపాలతో మయన్మార్, థాయ్ లాండ్ వణికిపోయింది. ఒకదాని తర్వాత మరొక భూకంపం సంభవించడంతో మయన్మార్ లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు కనీసం 144 మంది మరణించడంతో పాటు 732 మంది గాయపడ్డారని మయన్మార్ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న MRTV వెల్లడించింది. అటు బ్యాంకాక్ లోనూ పదుల సంఖ్యలో చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతున్నది. కూలిన శిథిలాల కింద చిక్కుకుని మందలాది మంది గాయపడడ్డారు. తవ్వినా కొద్దీ మృతులు బయపడుతున్నారు. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కుప్పకూలిన భారీ భవంతుల కింద చిక్కుకొని ఎంతో మంది కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు కఠోరంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని జనాలు తమ కుటుంబ సభ్యులతో పాటు సర్వం కోల్పోయి కంటతడి పెడుతున్న దృశ్యాలు అందరినీ ఆవేదనకు గురి చేస్తున్నాయి.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
అటు థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి భవనాన్ని తనిఖీ చేయాలని ఆ దేశ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జాతీయ విపత్తు సంస్థలకు ఆర్డర్స్ జారీ చేసశారు. మయన్మార్, థాయ్ లాండ్ లో భూకంప ప్రభావంతో గాయపడిన వారికి ట్రీట్మెంట్ అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం దుబాయ్ లోని తన లాజిస్టిక్స్ హబ్ ను రెడీ చేస్తున్నట్లు వెల్లడించింది.
కుప్పకూలిన ఐకానిక్ వంతెన
ఇక మయన్మార్ లోని నేపిడాలో 1000 పడకల హాస్పిటల్ భూకంప తీవ్రతకు కూలిపోయింది. మాండలే సిటీలోని ఐకానిక్ బ్రిడ్జి, పలు ప్రాంతాల్లోని ఎత్తైన పురాతన ఆలయాలు, గోపురాలు ధ్వంసం అయ్యాయి. బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన బ్రిడ్జి కూలడంతో ఏకంగా 90 మంది ఆచూసీ గల్లంతైనట్లు థాయ్ లాండ్ రక్షణ మంత్రి వెల్లడించారు. వారి కోసం సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా గుర్తింపు
ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో మయన్మార్, థాయ్ లాండ్ దేశాల్లో వరుస భూకంపాలు సంభవించాయి. వాటిలో మొదటిది రిక్టర్ స్కేలుపై 7.7గా తీవ్రత నమోదు కాగా, రెండో భూకంపం 6.4గా రికార్డు అయ్యింది. భూకంపం ధాటికి మయన్మార్, థాయ్ లాండ్లోని పలు భారీ భవంతులు కుప్పకూలాయి. మయన్మార్ రాజధాని నగరం నేపిడాలో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. థాయ్ లాండ్ లో భారీ భూకంపం దృష్ట్యా నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
ఇక బ్యాంకాక్ లో భూప్రకంపనలతో భారీ భవంతులపై ఉన్న స్విమ్మింగ్ పూల్స్ లోని నీరు కిందికి పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు మెట్రో స్టేషన్ లో ఆగిన మెట్రో రైలు అట్టపెట్టెలా వణికిపోయింది. పలు భవంతులు కళ్లముందే కుప్పకూలిపోతున్న వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అటు విమానాశ్రయంలో భూకంపం రావడంతో ప్రయాణీకులు భయంతో రన్ వే మీదే పడుకున్నారు. విమానాలు వణికిపోయింది. అటు బ్యాంకాక్ లో మెట్రో సేవలు నిలిపివేశారు.
Read Also: భూకంపానికి రైలు ఎలా ఊగిపోయిందో చూశారా? గుండె దడ పుట్టించే వీడియో!