Iran – India : ఇరాన్ తగలబడుతోంది. ఇజ్రాయెల్ దాడిలో శిథిలం అవుతోంది. టెహ్రాన్లో ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది. రెండు దేశాల పరస్పర దాడులతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బతుకు పోరాటం చేస్తు్న్నారు. ఇరాన్లో అనేక మంది ఇండియన్స్ కూడా ఇరుక్కుపోయారు. అక్కడి ఆయిల్ కర్మాగారాల్లో, భవన నిర్మాణాల్లో పని చేసే భారతీయులు చాలామందే ఉన్నారు. యుద్ధంతో వారి విషయంలో ఆందోళన నెలకొంది.
ఇరాన్ ఎయిర్స్పేస్ క్లోజ్
ఇజ్రాయెల్ అటాక్తో ఇరాన్ తన గగన తలాన్ని మూసేసింది. నో ఫ్లై జోన్గా ప్రకటించింది. ఎలాంటి యుద్ధ, పౌర విమానాలు ఇరాన్ మీదుగా ఎగరడానికి వీలు లేదు. అలా కాదని ఎగిరితే.. కనిపిస్తే కూల్చేసుడే.. అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. యుద్ధ సమయంలో తమ దేశ ఎయిర్స్పేస్ మూసేయడం కామన్. ఇటీవల ఇండియా, పాకిస్తాన్ వార్లోనూ రెండు దేశాలు అలానే చేశాయి. పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసేశాం. కానీ, ఇరాన్లో అలా కాదు. ఏ దేశ విమానాలకూ అక్కడ ఎంట్రీ లేదు. అలా చాలామంది విదేశీయులు యుద్ధ భూమిలో ఇరుక్కుపోయారు. అక్కడి నుంచి బయటపడే దారిలేక చావు భయంతో ఉంటున్నారు.
ఇరాన్ ఇండియా రిలేషన్స్
ప్రస్తుతం ఇరాన్ ప్రపంచ దేశాలకు శత్రువు కావొచ్చు కానీ, ఇండియాకు మాత్రం కాదు. మనకు, ఇరాన్కు మొదటినుంచీ మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ దేశం నుంచి పెద్ద మొత్తంలో చమురు కొంటున్న కంట్రీస్లో భారత్ ఒకటి. కొంతకాలం క్రితం అమెరికా ఆంక్షలు విధించినా.. డోంట్ కేర్ అంటూ ఇరాన్తో చమురు కొనుగోలు ఒప్పందం చేసుకుంది ఇండియా. అగ్రరాజ్యం భయానికి మిగతా దేశాలు ఇరాన్ ఆయిల్ కొనకుండా ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూసినా.. ఆ సమయంలో ఇండియానే ఆదుకుంది. ఆ విశ్వాసంతోనే ఇరాన్ మనకు ఇప్పుడో సాయం చేసింది. అదేంటంటే…
ఆపరేషన్ సింధు..
భారత్ కోసం తన గగన తలాన్ని తెరిచేందుకు ఇరాన్ ప్రత్యేక మినహాయింపు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి అవకాశం పొందిన ఏకైక దేశం ఇండియానే. వెంటనే ‘ఆపరేషన్ సింధు’ చేపట్టింది భారత్. ఇరాన్లో చిక్కుకున్న 1000 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొస్తోంది. మూడు విమానాల్లో వీరిని తరలిస్తున్నారు. అయితే, ఇరాన్ వ్యాప్తంగా సుమారు 4వేల మంది ఇండియన్స్ ఉంటారని అంచనా. వారిలో 2వేల మంది విద్యార్థులేనని తెలుస్తోంది. వీరందరినీ తరలించడం కష్టమే. వారిలోనూ కొందరు వచ్చేందుక ఇష్టపడటం లేదట. సో, ఆపరేషన్ సింధు ఫస్ట్ ఫేజ్లో మూడు విమానాల్లో దాదాపు వెయ్యి మందిని భారత్కు తరలిస్తున్నారు. ఇరాన్-ఇండియా. మనం మనం.. దోస్త్ దోస్త్.