Balochistan Violence: పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ లో భద్రతా బలగాలు, మిలిటెంట్ల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 40 గంటల్లో 145 మంది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు మరణించారని ఆ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి ఆదివారం ప్రకటించారు. ఈ ఘటనలో పాక్ సైన్యానికి చెందిన డజన్ల కొద్ది బలగాలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
బలూచిస్థాన్ లోని బీఎల్ఏ ప్రభావిత ప్రాంతాల్లో పాక్ సైన్యం కూంబింగ్ నిర్వహిస్తోంది. శుక్రవారం మెుదలైన ఈ కూంబింగ్ ఆదివారం కూడా కొనసాగుతున్నట్లు బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి స్పష్టంచేశారు. పాక్ సైన్యం కాల్పుల్లో ఇప్పటివరకూ 145 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పాక్ సైన్యం చేస్తున్న పోరులో ఈ స్థాయిలో మిలిటెంట్లు చనిపోవడం ఇదే తొలిసారని స్పష్టం చేశారు.
బలూచిస్థాన్ లోని క్వెట్టా, గ్వాదర్, మస్తుగ్, నోష్కితో సహా అనేక జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 17 మంది భద్రతా బలగాలు, 31 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ బుగ్టి పేర్కొన్నారు. బీఎల్ఏ మిలిటెంట్లు ప్రారంభించిన ఈ మారణహోమాన్ని అంతం చేసేందుకు పాక్ సైన్యం సాహసోపేతంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కాగా నసీరాబాద్ జిల్లాలో ముష్కరులు రైల్వే ట్రాక్ పై బాంబు అమర్చగా.. భద్రతా బలగాలు గుర్తించి నిర్విర్యం చేశాయని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: Union Budget 2026: వికసిత భారతే లక్ష్యం.. మూడు కర్తవ్యాల బాటలో కేంద్ర బడ్జెట్ 2026, అవి ఇవే..
అయితే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీని రెచ్చగొట్టి పాక్ లో అశాంతిని భారత్ సృష్టిస్తోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. దాడి చేసిన వారికి భారత్ తో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు. ఇస్లామాబాద్ తన అంతర్గత వైఫల్యాల నుంచి ప్రపంచం దృష్టి మళ్లించేందుకు భారత్ పై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రతీసారి భారత్ పై నిందలు వేసే బదులు.. బలూచిస్థాన్ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంపై పాక్ దృష్టి పెట్టాలని జైస్వాల్ ఘాటుగా సూచించారు.
Also Read: Bangladesh Aid: బంగ్లాదేశ్ ఓవరాక్షన్.. కేంద్ర బడ్జెట్లో నిధులు కట్.. ఎంత శాతమంటే?