Lahore Streets: పాకిస్తాన్ సాంస్కృతిక రాజధానిగా పిలవబడే లాహోర్ నగరంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. విభజన కాలం నాటి చేదు జ్ఞాపకాలు, రాజకీయ కారణాల వల్ల గతంలో మార్చబడిన వీధుల పేర్లను తిరిగి పాత పద్ధతిలోనే పునరుద్ధరించేందుకు అక్కడి స్థానిక యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే గతంలో ‘రామ్ గల్లీ’గా ఉండి తర్వాత ‘రెహమాన్ గల్లీ’గా మారిన ఒక ప్రముఖ వీధికి మళ్లీ పాత పేరునే ఖరారు చేశారు. దీంతో ఈ అంశం అటు పాక్ తో పాటు భారత్ లోనూ చర్చనీయాంశంగా మారింది.
1947 భారత్-పాక్ విభజనకు ముందు లాహోర్ నగరంలో ముస్లిమేతరులు (హిందువులు, సిక్కులు) పెద్ద సంఖ్యలో నివసించేవారు. అక్కడి అనేక వీధులు, ప్రాంతాలకు హిందూ దేవతల పేర్లు లేదా ప్రముఖుల పేర్లు ఉండేవి. అయితే విభజన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఆ పేర్లను ఇస్లామిక్ సంస్కృతికి అద్దం పట్టేలా మార్చేసింది. అలా ‘రామ్ గల్లీ’ కాస్తా ‘రెహమాన్ గల్లీ’గా మారిపోయింది.
అయితే మళ్లీ ఇన్నాళ్ల తర్వాత పాత పేర్లను తీసుకురావడం వెనుక ముఖ్యంగా రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి చరిత్రను కాపాడుకోవడం కాగా, రెండోది స్థానికుల గుర్తింపు. మెుదటి అంశానికి వస్తే.. లాహోర్ నగరానికి ఉన్న అసలైన బహుళ సాంస్కృతిక (Multi-cultural) చరిత్రను, వారసత్వాన్ని అలాగే కొనసాగించాలని చరిత్ర కారుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. మరోవైపు ప్రభుత్వ రికార్డుల్లో పేర్లు మార్చినప్పటికీ.. స్థానిక ప్రజలు ఇప్పటికీ వాటిని పాత పేర్లతోనే పిలవడానికి అలవాటు పడ్డారు. దీనివల్ల చిరునామాలు కనుక్కోవడంలో గందరగోళం ఏర్పడుతోంది.
లాహోర్ జిల్లా యంత్రాంగం దీనికోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేవలం ‘రామ్ గల్లీ’ని మాత్రమే కాకుండా.. విభజన తర్వాత పేరు మార్చబడిన దాదాపు 20కి పైగా చారిత్రాత్మక వీధులు, చౌరస్తాల పాత పేర్లను తిరిగి పునరుద్దరించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో కృష్ణనగర్, జైన్ మందిర్ చౌక్, పేర్లను ఇప్పటికే పునరుద్దరించింది. శాంత్ నగర్, లక్ష్మీ చౌక్, ధర్మపుర, టెంపుల్ స్ట్రీట్, జైన్ మందిర్ రోడ్ తదితర ప్రాంతాల పేర్లు సైతం పరిశీలన దశలో ఉన్నాయి. మెుత్తంగా 2 నెలల వ్యవధిలో కనీసం 9 ప్రాంతాల పేర్లను లాహోర్ లో మార్చినట్లు పాక్ మీడియా పేర్కొంది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది.
Also Read: అవినీతిపై సీఎం విజయ్ సర్జికల్ స్ట్రైక్.. లంచగొండులను పట్టిస్తే రూ. 1 లక్ష రివార్డు?
లాహోర్ లోని ప్రాంతాలకు పాత హిందూ పేర్లు పెట్టాలన్న అభిప్రాయాలపై పాకిస్తాన్ సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు చరిత్రకారులు, విద్యావేత్తలు, ప్రగతిశీలవాదులు స్థానిక యంత్రాంగం నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నారు. విభజనతో సంబంధం లేకుండా లాహోర్ నగరానికి ఉన్న శతాబ్దాల నాటి బహుళ సాంస్కృతిక వారసత్వాన్ని, వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో అవసరమని వారు వాదిస్తున్నారు. మరోవైపు అక్కడి సాంప్రదాయవాదులు, మతపరమైన సంస్థలు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఒక ఇస్లామిక్ దేశంలో మళ్లీ హిందూ దేవుళ్ల లేదా వ్యక్తుల పేర్లను పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మార్పు స్థానిక సంస్కృతిని దెబ్బతీస్తుందనే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: దేశంలో ఫస్ట్ టైమ్.. Airtel నుంచి సరికొత్త 5G టెక్నాలజీ.. రూ. 449కే అదిరిపోయే బెనిఫిట్స్!