PIA Flight: విమాన సిబ్బంది నిర్లక్ష్యం తీరని దుఖంలో ఉన్న తల్లిదండ్రులకు మరింత ఆవేదన కలిగించింది. అప్పటికే కుమారుడి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనతో నిర్ఘాంత పోయారు. అంత్యక్రియల కోసం బాలుడి మృతదేహం తరలించేందుకు విమానం ఎక్కగా తమ వెంట మృతదేహం రాకపోవడంతో షాక్ అయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్ లో జరిగింది.
ఖర్మాంగ్ జిల్లాకు చెందిన ఆరేళ్ల ముక్తాబాను కణితి కారణంగా రావల్పిండిలోని బెనజీర్ బుట్టో ఆసుపత్రికి తల్లిందండ్రులు తరలించారు. అక్కడ బాలుడికి డాక్టర్లు చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో ముక్తాబా గురువారం మృతి చెందాడు. బాలుడి మృతి వార్త విన్న తల్లిదండ్రులు ఎంతో కుంగి పోయారు.
అయినప్పటికీ అంతక్రియలు చేసేందుకు మృతదేహాన్ని సొంత ఊరికి తరలించేందుకు సిద్ధమయ్యారు. రోడ్డు మార్గంలో వెళితే ఆలస్యం అవుతుందని భావించిన వారు విమానంలో ప్రయాణించడానికి నిర్ణయించుకున్నారు. ఇక్కడే వారి ఆలోచన తలక్రిందులైంది. గిల్గిత్ లోని స్కర్దు విమానాశ్రయానికి వచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు.
Also Read: తాలిబన్ దేశంలో వరదలు.. ఒక్కరోజులోనే 200 మంది మృతి
కుమారుడి మృతదేహాన్ని సిబ్బంది విమానంలో తరలించ లేదన్న విషయం తెలుసుకుని కంగుతిన్నారు. వారి రోదనతో ఆ ప్రాంతమంతా మారు మోగింది. సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన సిబ్బంది తప్పును ఒప్పుకున్నారు. వీలైనంత త్వరగా సరి దిద్దుకుంటామని హామీ ఇచ్చారు. బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పై అధికారులు తెలిపారు.