PM Modi Said India-Austria friendship to get stronger: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రియాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్ బర్గ్, భారత రాయబారి శంభు కుమారన్, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రియాతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రధాని మోదీ.. ఆ దేశ ఛాన్స్లర్ కార్ల్ నెహమ్మెర్తో భేటీ అయ్యారు.
ఆస్ట్రియాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీకి ఆ దేశ ఛాన్స్లర్ కార్ల్ నెహమ్మెర్ ఆతిథ్య విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. భారత్, ఆస్ట్రియా బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆస్ట్రియా దేశాల మధ్య స్నేహ బంధం దృఢంగా ఉందని, భవిష్యత్తుల్లోనూ ఈ బంధం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు చేసినందుకు ఛాన్స్లర్ కార్ల్ నెహమ్మెర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఇరు దేశాలు ప్రపంచం కోసం పనిచేస్తాయని ఎక్స్ వేదికగా ఆయనతో దిగిన ఫోటోలను ప్రధాని మోదీ షేర్ చేశారు.
ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడి అధికారులు ఇచ్చిన సర్ప్రైజ్ అదిరిపోయింది. ఓ మ్యూజిక్ బృందం ‘వందేమాతరం’ ఆలపిస్తూ లైవ్ ప్రదర్శన చేసింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘శక్తివంతమైన సంగీత సంస్కృతికి పేరొందిన ఆస్ట్రియాలో ఈ ప్రత్యేక అనుభవాన్ని అందించింనందుకు ధన్యవాదాలు.’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
దేశ ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 1983లో ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో ఆస్ట్రియా దేశాన్ని సందర్శించారు. కాగా, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకొన 75 ఏళ్లు పూర్తయినట్లు భారత విదేశాంగ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ పర్యటనలో భాగంగా మోదీ.. భారతీయ సంతతికి చెందిన వ్యక్తులతో వియన్నాలో ప్రధాని భేటీ కానున్నారు.