Muslim women entitled to alimony: ముస్లిం మహిళలకు సంబంధించి సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. విడాకుల తర్వాత వారు కూడా భరణం పొందడానికి అర్హులని స్పష్టంచేసింది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం.. విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం కొట్టి వేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం పొందవచ్చని తీర్పు వెల్లడించింది.
భరణానికి సంబంధించిన హక్కు కల్పించే ఆ సెక్షన్ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింప జేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. మహ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేశాడు పిటిషన్దారుడు.
విడాకుల తర్వాత ముస్లిం మహిళలు తమ భర్తల నుంచి ఆర్థిక సాయాన్ని పొందే హక్కును కలిగి ఉంటారన్నది ఆ తీర్పులోని మెయిన్ పాయింట్. భరణం అనేది విరాళం కాదని, అది పెళ్లైన ప్రతీ మహిళ హక్కు అని స్పష్టం చేసింది. పౌరులందరికీ చట్టం ప్రకారం వర్తిస్తుందని తెలిపింది. సమానత్వం, రక్షణ సూత్రాన్ని బలపరుస్తుందని వెల్లడించింది. మతంతో సంబంధం లేకుండా చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది అత్యున్నత న్యాయస్థానం.
ALSO READ: పూరీలో అపశృతి, రథం నుంచి పక్కకి ఒరిగిన విగ్రహం
విడాకుల తర్వాత మాజీ భార్యకు ప్రతీ నెలా 20 వేల రూపాయలు భరణం చెల్లించాలని తెలంగాణలోని ఫ్యామిలీ కోర్టు మహ్మద్ అబ్దుల్ సమద్కు సూచించింది. అయితే సమద్ తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చారని ఆ మహిళ సీఆర్పీసీ సెక్షన్ 125 కింద భరణం కోసం దరఖాస్తు చేసింది. అయితే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుపై సమద్ హైకోర్టుకు వెళ్లాడు. ఈ కేసుపై తీర్పు వచ్చేవరకు మధ్యంతర భృతిగా 10 వేలు చెల్లించాలని ఆదేశించింది.