Trump – Modi : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత ప్రధాని మోదీ తొలిసారి ఆయనకు ఫోన్ లో మాట్లాడారు. అమెరికా ఎన్నికలు ముగిసి దాదాపు మూడు నెలల కావాస్తుంది. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల్ని ఈ నెల 20న తీసుకున్నారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ.. నేరుగా ఇరు దేశాల కీలక అధినాయకులు ఇప్పటి వరకు సంభాషించుకోలేదు. గణతంత్ర వేడుకల ముగిసిన తర్వాత ఫోన్ చేసిన మోదీ.. ట్రంప్ నకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనేక విషయాలపై ఇరుదేశాల అధినేతలు చర్చించినట్లు తెలిపారు.
వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు ఒకరికొకరు మంచి స్నేహితులుగా పిలుచుకుంటుంటారు. ట్రంప్ హయాంలో మోదీ పర్యాటన సందర్భంగా కానీ, భారత సందర్శనకు ట్రంప్ వచ్చిన సందర్భంలో కానీ.. ఒకరికొకరు భారీ స్వాగత ఏర్పాట్లు చేసుకున్నారు. అలాంటి నేతలు, రెండు అగ్రగామి ప్రజాస్వామ్య దేశాల అధినేతలు.. కాస్త ఆలస్యంగానే మాట్లాడుకున్నారు అంటున్నారు విశ్లేషకులు.
ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి అక్కడి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడంలో బిజీగా గడుపుతున్నారు. వరుస ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లు జారీ చేస్తూ హడావిడిగా ఉన్నారు. ఇక భారత ప్రధాని సైతం దిల్లీ ఎన్నికల సహా గణతంత్ర దినోత్సవ వేడుకల హడావిడిలో ఉన్నారు. అందుకే.. ఇరు నాయకులు మధ్య కాస్త మాటలు ఆలస్యం అయినట్లు ఉందని అంటున్నారు. కాగా.. డెమోక్రటిక్ ప్రత్యర్థి కమలా హారిస్పై అద్భుతమైన విజయం సాధించిన మూడు నెలల తర్వాత ట్రంప్ ను పలకరించిన మోదీ.. ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ నెల 20న వాషింగ్టన్లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. చాలా గ్రాండ్ గా నిర్వహించిన ఈ వేడుకకు భారతీయ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు హాజరయ్యారు. వీరితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్తో సహా పలువురు భారతీయ-అమెరికన్లు కూడా ఈ కార్యక్రమంలో కనిపించారు.
ఇక ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమ విదేశాంగ మంత్రికి ముందు వరుసలో సీటు కేటాయించారు కూడా. ఆ కార్యక్రమం తర్వాత స్వాడ్ దేశాల ప్రతినిధులతో జైశంకర్ వరుస సమావేశాలు నిర్వహించారు. ట్రంప్ హయాంలోనూ భారత్ – యూఎస్ఏ మధ్య బలమైన సంబంధాలు నెలకొంటాయని, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని ఆకాంక్షించారు.
Also Read : ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీకి ఆ దేశంతో భారత్ ఒప్పందం.. చైనానే టార్గెట్ గా వ్యూహాలు..
రానున్న రోజుల్లో అమెరికా – భారత్ మధ్య మరింత బలమైన పునాదులు వేసేందుకు ఇద్దరు నేతలు కృషి చేస్తారంటూ విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆసియాలో భారత్ బలమైన భాగస్వామి కావడం, పసిఫిక్ సముద్రంలో చైనా ఆగడాలను అడ్డుకునేందుకు భారత్ సహకారం అవసరమైన నేపథ్యంలో.. ట్రంప్ విధానాలు భారత్ కు అనుకూలంగానే ఉంటాయని అంటున్నారు.